ఈయనలా అందరూ చేస్తే.. పార్టీ గెలవక ఏమౌతుంది?

గుంటూరు జిల్లా టీడీపీ అంటేనే ఏళ్లకు ఏళ్లుగా త‌ల‌పండిపోయిన సీనియ‌ర్ల అడ్డా. ఏళ్లకు ఏళ్లుగా నియోజ‌క‌వ‌ర్గాల్లో పాతుకుపోయిన సీనియ‌ర్ నేత‌లే ఇక్కడ క‌నిపిస్తారు. ప‌ల్నాడులో య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, [more]

Update: 2021-01-31 03:30 GMT

గుంటూరు జిల్లా టీడీపీ అంటేనే ఏళ్లకు ఏళ్లుగా త‌ల‌పండిపోయిన సీనియ‌ర్ల అడ్డా. ఏళ్లకు ఏళ్లుగా నియోజ‌క‌వ‌ర్గాల్లో పాతుకుపోయిన సీనియ‌ర్ నేత‌లే ఇక్కడ క‌నిపిస్తారు. ప‌ల్నాడులో య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, జీవి. ఆంజ‌నేయులు, కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్‌, ప్రత్తిపాటి పుల్లారావు ఇటు డెల్డాలో మాజీ మంత్రులు ఆల‌పాటి రాజా, మాకినేని పెద‌ర‌త్తయ్య, న‌క్కా ఆనంద్ బాబు, అటు పొన్నూరులో కాక‌లు తీరిన ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ ఉన్నారు. అయితే వీళ్లంతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో అధికారం వెల‌గ‌పెట్టారు. మంత్రులుగా ఉన్న ప్రత్తిపాటి, న‌క్కా ఆనంద్ బాబు.. ఇటు సీనియ‌ర్ నేత‌లు ఎవ‌రికి వారే అటు త‌మ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ఇటు జిల్లా కేంద్రంతో పాటు ఎక్కడ వీలుంటే అక్కడ జోక్యం చేసుకునేవారు.

చివరి క్షణంలో సీటు దక్కించుకుని……

ఎప్పుడు అయితే పార్టీ చిత్తుగా ఓడిపోయిందో అప్పటి నుంచి ఈ నేత‌ల్లో చాలా మంది సైలెంట్ అయిపోయారు. మ‌రి కొంద‌రు సీనియ‌ర్లు యేడాదిన్నర పాటు మౌనంగా ఉండి.. జ‌మిలీ హ‌డావిడి స్టార్ట్ అయ్యాకే బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్రెస్ మీట్లు పెడుతూ ప్రభుత్వాన్ని త‌ూర్పార ప‌ట్టే ప‌నిలో బిజీ బిజీ అవుతున్నారు. అయితే ఈ సీనియ‌ర్ నేత‌లు అంద‌రూ ఒక ఎత్తు… అదే జిల్లాలో పార్టీకి చెందిన మ‌రో జూనియ‌ర్ ఒక ఎత్తు అయ్యారు. ఆ జూనియ‌ర్ నేత ఎవ‌రో కాదు న‌ర‌సారావుపే టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ చ‌ద‌ల‌వాడ అర‌వింద బాబు. గ‌త ఎన్నిక‌ల్లో చివ‌రి క్షణంలో అనూహ్యంగా ఆయ‌న సీటు ద‌క్కించుకున్నారు.

రోజూ ఏదో ఒక కార్యక్రమంతో…

కోడెల చివ‌రి వ‌ర‌కు ఊగిస‌లాడి.. చివ‌ర్లో స‌త్తెన‌ప‌ల్లి సీటు ఫిక్స్ చేసుకోవ‌డంతో.. చంద్రబాబు బీసీ కోటాలో డాక్టర్‌గా మంచి పేరున్న అర‌వింద‌బాబును తెర‌మీద‌కు తెచ్చారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మ‌రుస‌టి రోజు నుంచే అర‌వింద బాబు పార్టీని న‌ర‌సారావుపేట‌లో ప‌టిష్టం చేసేందుకు త‌న వంతుగా కృషి చేస్తున్నారు. ప్రతి రోజు నియోజ‌క‌వ‌ర్గంలో ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. అధికార వైసీపీ కార్యకర్తలు, నేత‌ల దాడిలో గాయ‌ప‌డ్డ టీడీపీ కార్యక‌ర్తల‌ను కేవ‌లం పరామ‌ర్శించ‌డ‌మే కాకుండా… స్వత‌హాగా డాక్టర్ కావ‌డంతో వారికి ద‌గ్గరుండి మ‌రీ ట్రీట్ మెంట్ చేయించ‌డంతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.

దూరమయిన నేతలంతా…..

న‌ర‌సారావుపేట‌లో టీడీపీ చివ‌రి సారిగా 1999లో మాత్రమే గెలిచింది. ఆ త‌ర్వాత జ‌రిగిన నాలుగు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా ఓడిపోతూ వ‌స్తోంది. అప్పట్లో కోడెల చ‌ర్యల‌తో ప‌ట్టణంలోని కొన్ని వ‌ర్గాలు టీడీపీకి పూర్తిగా దూర‌మైపోయాయి. ఇప్పుడు వారంతా అర‌వింద‌బాబు వ‌చ్చాక టీడీపీకి ద‌గ్గర‌వుతోన్న ప‌రిస్థితి వ‌చ్చిందంటే అర‌వింద‌బాబు పార్టీ కోసం ప‌డిన క‌ష్టం అర్థమ‌వుతోంది. చివ‌ర‌కు చంద్ర‌బాబు సైతం ఇటీవ‌ల జిల్లా స‌మీక్షతో పాటు రాష్ట్ర స్థాయి స‌మీక్షలో అర‌వింద‌బాబు క‌ష్టాన్ని ప్రత్యేకంగా మెచ్చుకోవ‌డంతో పాటు ఈ స్థాయిలో ప్రతి ఒక్క నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ క‌ష్టప‌డితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న‌కు 170 సీట్లు త‌గ్గవ‌ని చెప్పారు.

వైసీపీ బలంగా ఉన్న చోట….

స్వత‌హాగా సౌమ్యుడు, వివాద ర‌హితుడిగా పేరున్న అర‌వింద‌బాబు ఇటు సోష‌ల మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల‌పై పోరాటం చేయ‌డంతో పాటు త‌న కార్యక్రమాలు ప్రజ‌ల్లోకి చొచ్చుకుపోయేలా ప్లాన్ చేసుకున్నారు. పైగా టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ సీటులో క‌మ్మ సామాజిక వ‌ర్గ నేత‌లే ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తున్నారు. ఈ సారి అరవిందబాబు ఇక్కడ క్యాస్ట్ ఈక్వేష‌న్ మార్చగా.. ఆ వ‌ర్గ నేత‌ల‌ను కూడా స‌మ‌న్వయం చేసుకుంటూ అర‌వింద‌బాబు ముందుకు వెళుతోన్న ప‌రిస్థితి. ఏదేమైనా వైసీపీ ఆవిర్భావం త‌ర్వాత జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్కడ ఆ పార్టీ భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించింది.. అలాంటి చోట అర‌వింద‌బాబు టీడీపీ జెండా ఎగ‌ర‌వేస్తాడా ? లేదా ? అన్నది కాల‌మే నిర్ణయించాలి.

Tags:    

Similar News