ఫ్యాక్ట్ చెక్: మహారాష్ట్రలో ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బుకు సంబంధించిన వీడియో కాదు.

మహారాష్ట్రలో ఇటీవల 5 కోట్ల డబ్బు కారులో దొరికింది

Update: 2024-10-26 10:13 GMT
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20, 2024న జరుగుతాయని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ ఇటీవలే ప్రకటించారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో ముగియనుంది.

మహారాష్ట్ర ఎన్నికలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. కూటముల మధ్య సీట్ల పంపకంలో ఎలాంటి తేడాలు వస్తాయోనని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆయన డిప్యూటీలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లను కలిశారు.

శివసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొన్ని స్థానాలకు సంబంధించి విభేదాలు ఇంకా పరిష్కారం అవ్వలేదు. మహాయుతి కూటమి సీట్ల పంపకం గురించి సంప్రదింపుల కోసం పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లారు. శివసేన (UBT), కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తో కూడిన మహా వికాస్ అఘాడి (MVA) నవంబర్ 20న పాలక ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, BJP, NCP లోని మహాయుతి కూటమికి వ్యతిరేకంగా పోరాడుతోంది.

ప్రత్యర్థి MVAని ఎదుర్కోవడానికి కూటమి భాగస్వాములు ఐక్యంగా పని చేయాలని, సంకీర్ణాన్ని బలోపేతం చేయాలని అమిత్ షా కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా మహాయుతి వర్గాల నుండి ఎవరూ తిరుగుబాటుదారులు ఎన్నికలలో పోటీ చేయకుండా చూసుకోవాలని కూటమి నేతలు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలకు అమిత్ షా సలహా ఇచ్చారు. ఇక 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అతిపెద్ద పార్టీగా అవతరించే ప్రయత్నంలో కాషాయ పార్టీ 150 సీట్లకు పైగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 29 కావడంతో కొన్ని స్థానాలకు సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతూ ఉంది.

ఇంతలో పూణే-బెంగళూరు హైవే లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడిందనే వాదనతో ఓ వీడియోను షేర్ చేస్తున్నారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ పూణెలో పట్టుబడిన నగదుకు సంబంధించి వీడియో అంటూ పోస్ట్ చేశారు.

పవార్ పోస్ట్‌లో "అధికార పార్టీ అభ్యర్థులకు ఎన్నికలకు మొదటి విడతగా 25 కోట్లు ఇచ్చారు. ఒకటి ఖేడ్-శివాపూర్ నుండి పట్టుబడింది. డోంగర్_జాడీమధ్య ఒక కారు దొరికింది కానీ మిగిలిన నాలుగు కార్లు ఎక్కడ ఉన్నాయి?" అంటూ ఆరోపించారు. "ఎన్నికల కోసం మొదటి విడతగా అధికార పార్టీ అభ్యర్థులకు 25 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా మహారాష్ట్ర ప్రజల సొమ్మును నీళ్లలా కుమ్మరించి కొనుగోలు చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నించినా ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం మహాకూటమికి షాకిచ్చింది." అంటూ పోస్టు పెట్టారు.




'ఖేడ్-శివాపూర్ టోల్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే కారులో కోట్ల విలువైన నోట్లు దొరికిన షాకింగ్ వీడియో వైరల్?' అంటూ ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు.



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో కొన్ని సంవత్సరాలుగా ఆన్ లైన్ లో ఉందని గుర్తించాం.

రోహిత్ పవార్ చేసిన ట్వీట్ కింద కామెంట్లలో ఈ వీడియో 2021 నుండి ఆన్ లైన్ లో ఉందంటూ కామెంట్ పెట్టడాన్ని మేము గుర్తించాం.



మేము వైరల్ వీడియోలోని కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అదే వీడియోను సెప్టెంబరు 2021లో అదే మ్యూజిక్ తో YouTubeలో పోస్ట్ చేసినట్లు గుర్తించాం.

Full View


ఇక మరో వీడియోను Rupee 50000000000000000000000000 అనే టైటిల్ తో మే 10, 2020న యూట్యూబ్ లో అప్లోడ్ చేశారని కూడా గుర్తించాం. ఇందులో వేరే మ్యూజిక్ ను వాడారు.

Full View


ఈ వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించి, వైరల్ వీడియో ఇటీవలిది కాదని స్పష్టంగా తెలుస్తోంది.


pune cash found అనే కీవర్డ్స్ ను ఉపయోగించి పూణేలో డబ్బులు దొరికిన ఘటనకు సంబంధించిన నివేదికలను మేము చూశాం. హిందుస్థాన్ టైమ్స్, ఎన్డీటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పలు మీడియా సంస్థల్లో నివేదికలను చూశాం. ఎక్కడా కూడా వైరల్ వీడియోతో సరిపోలేలా విజువల్స్ మాకు లభించలేదు.

ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మహారాష్ట్రలో అక్టోబర్ 15 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉంది. పూణె రూరల్ పోలీసులు 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ముంబై-బెంగళూరు హైవేపై ఖేడ్-శివాపూర్ ప్లాజా సమీపంలో ఒక కారును సాయంత్రం పోలీసుల నాకాబందీ సమయంలో తనిఖీలు చేస్తున్నప్పుడు, లెక్కలు చూపించని నగదును స్వాధీనం చేసుకున్నట్లు పూణే రూరల్ పోలీసులు వెల్లడించారు. మీడియా నివేదికల ప్రకారం కారును పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ డబ్బుకు సంబంధించి పలు పార్టీల నాయకులు ఇతర పార్టీలపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

తదుపరి విచారణ నిమిత్తం నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు పుణె రూరల్ పోలీస్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ ధృవీకరించారు. అక్టోబరు 21వ తేదీ సాయంత్రం ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కమిషన్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు రాజ్‌గడ్ పోలీస్ స్టేషన్‌లో విచారణలో భాగమయ్యారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోకు ఇటీవల పూణేలో పట్టుబడ్డ 5 కోట్ల రూపాయల నగదుకు ఎలాంటి సంబంధం లేదు.


Claim :  మహారాష్ట్రలో ఇటీవల 5 కోట్ల డబ్బు కారులో దొరికింది. ఇది ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి వినియోగించనున్నారు.
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News