ఒలింపిక్ స్వర్ణంపై కన్నేసిన బాలీవుడ్ ఖిలాడీ

Update: 2016-10-22 05:32 GMT

బాక్సాఫీసుపై కాసులు కురిపించే బంగారం లాంటి సినిమా కథలను ఎవరూ వదులుకోరు. అందులోనూ అవి బయోపిక్ లైతే కర్చీప్ పట్టుకుని రెడీగా ఉంటారు బాలీవుడ్ స్టార్లు. ఇప్పుడు సీజన్ వాటిదే కదా.. చక్ దే నుంచీ.. రీసెంటుగా ట్రైలర్ తో ఇంటర్నెట్ షేక్ చేస్తున్న దంగల్ వరకూ ఇదే వరస. అదే వరుసలో మరో బయోపిక్ కు రెడీ అయిపోయాడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ఇలాంటి సినిమాలు అక్కీకి కొత్త కాదు. వన్సపాన్ ఎ టైం, బేబీ, ఎయిర్ లిఫ్ట్, రుస్తుం లాంటి రియల్ స్టోరీ సినిమాలతో కలెక్షన్లు కూడా కొల్లగొట్టి చూపించాడు. ఇప్పుడు నేరుగా ఒక స్ట్రెయిట్ బయోపిక్ కు రెడీ అవుతున్నాడు అక్షయ్ కుమార్.

భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన తొలి ఒలింపిక్ బంగారు పతకంపై చిత్రీకరించే సినిమాలో కీ రోల్ చేయబోతున్నాడు అక్షయ్. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ బ్యానర్ ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ నిర్మించే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా టైటిల్ గోల్డ్. దీన్ని రీమా కంగ్తి డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ న్యూస్ ను స్వయంగా అక్షయ్ తన ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేసాడు. 1948 ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చిన తొలి బంగారు పతకంపై తీయబోతున్న సినిమాలో నటిస్తున్నట్టు దాని పోస్టర్ ను కూడా ట్వీట్ చేసిన అక్కీ.. ఈ సినిమాను వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా అందించబోతున్నట్టు ప్రకటించాడు.

14వ ఒలింపిక్స్ లో భారత్ కు ఫీల్డ్ హాకీ గోల్ కీపర్ లియో పింటో బంగారు పతకం గెలుచుకున్నారు. ముంబైకి చెందిన ఈయన పాత్రలోనే తెరపై కనిపించబోతున్నాడు అక్షయ్. బ్రదర్స్ లో బాక్సర్ గా నటించిన అక్కీ ఇప్పుడు మొదటి సారి ఒలింపిక్ క్రీడాకారుడుగా తెరపై కనిపించబోతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో బయో పిక్ ల హవా నడుస్తుండడం, సెకండ్ లార్జెస్ట్ కలెక్షన్స్ రాబట్టే హీరోగా అక్కీకి ఫేమ్ ఉండడం.. నిర్మాతలకు కలిసొచ్చే అంశమే. ఇక అమీర్ తో తలాష్ లాంటి సినిమాను క్లైమాక్స్ వరకూ ఆసక్తికరంగా తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ రీమా.. ఈ సినిమాను ఎలా మలుస్తారన్నదే మిగిలింది.. అన్నీ కలిసొస్తే.. వచ్చే ఏడాది ఆగస్టు 15కు అక్షయ్ నిజంగా భారత అభిమానులకు అపురూప కానుక ఇచ్చినట్టే అవుతుంది.

Similar News