విలన్ ని హీరోగా, హీరోని విలన్ గా..

Update: 2016-10-12 11:08 GMT

దర్శకుడు తేజ కొత్త వాళ్లలోని ప్రతిభను అన్వేషించి తెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆలా జై సినిమాతో నవదీప్ ని హీరోగా పరిచయం చేసాడు తేజ. చిత్రం, నువ్వు నేను, జయం వంటి తన దిగ్విజయాల ఫామ్ ను కోల్పోయింది కూడా ఆ చిత్రంతోనే. తేజ పరిస్థితి పక్కన పెడితే, క్రిష్ణ వంశి వంటి మేటి దర్శకుడి చందమామ చిత్రంతో అలరించటం తప్ప మరే ఆశించిన స్థాయి ఫలితాలు దక్కలేదు నవదీప్‌కు . గౌతమ్ ఎస్.ఎస్.సి వంటి చిత్రాలు కొంత మేర ప్రేక్షకులని అలరించినా మోస్తరు విజయాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కథానాయకుడిగా అపజయాలు మూటగట్టుకున్న నవదీప్ సహా నటుడిగా, బుల్లి తెర పై కొన్ని కార్యక్రమాలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడు.

బాహుబలి చిత్రంలోని బల్లాల దేవా పాత్ర తో విలనిజం స్థాయిని మరో వంద మెట్లు ఎక్కించేసిన రానా దగ్గుబాటి బాహుబలి2 చిత్రీకరణ తర్వాత తాను నటించబోయే చిత్రాల కార్యాచరణ ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నాడు. రానా చెయ్యబోయే చిత్రాలలో దర్శకుడు తేజ చిత్రం ఒకటి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ నాయక నాయికలుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నవదీప్ ప్రతినాయకుడి పాత్ర పోషించనుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో దగ్గుబాటి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

నవదీప్ కథానాయకుడిగా నటించి విజయం సాధించిన చందమామ చిత్రంలో కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు నవదీప్ విలన్ పాత్ర పోషిస్తున్న చిత్రంలో కథానాయిక గానే కనిపిస్తుంది. నవదీప్ ని వెండి తెర కు పరిచయం చేసిన దర్శకుడు తేజ కాజల్ అగర్వాల్ కి కూడా లక్ష్మి కళ్యాణం చిత్రంతో వెండి తెరపై మొదటి అవకాశం కలిపించటం విశేషం.

Similar News