ఎటూ కాకుండా పోయారా... వచ్చినా నో టిక్కెట్

కడప జిల్లాలో సీనియర్ నేత సతీష్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా దూరమయిపోయారు.

Update: 2022-02-23 04:47 GMT

కడప జిల్లాలో సీనియర్ నేత సతీష్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా దూరమయిపోయారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన పాలిటిక్స్ కు పది అడుగుల దూరంలోనే ఉన్నారు. పులివెందులలో గత కొన్నిసార్లుగా వైఎస్ కుటుంబంపై పోటీ చేసి సతీష్ రెడ్డి సంచలనం సృష్టించారు. ఓటమి పాలయినా వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొన్నారన్న ఏకైక కారణంగానే ఆయనకు టీడీపీలోనూ, రాష్ట్రంలోనూ ప్రత్యేక గుర్తింపు లభించింది.

ప్రయారిటీ ఇచ్చి...
అందుకే చంద్రబాబు సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. సతీష్ రెడ్డి కూడా పులివెందులకు నీరు అంటూ శపథం చేసి మరీ గడ్డం పెంచారు. తర్వాత మొక్కు తీర్చుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం సతీష్ రెడ్డి కొంత స్లో అయ్యారు. అనంతరం ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ కోలుకోవడం కష్టమేనని, లోకేష్ నాయకత్వంలో ఆ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదని సంచలన వ్యాఖ్యలు చేసి రాజీనామా చేశారు.
బీటెక్ రవిని నియమించినా....
అయితే వెనువెంటనే సతీష్ రెడ్డి వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. వైసీపీలో చేర్చుకునేందుకు కూడా అందరూ సిద్ధమయ్యారు. కానీ ఎందుకో కారణం తెలియదు కాని సతీష్ రెడ్డి పార్టీలో మాత్రం చేరలేదు. ఆయన ప్రస్తుతం వైసీపీ, టీడీపీలకు సమానదూరంగా ఉన్నారు. పులివెందులలో బీటెక్ రవిని టీడీపీ ఇన్ ఛార్జిగా నియమించినా అది తాత్కాలికమే. బీటెక్ రవిని పులివెందుల టీడీపీ క్యాడర్ కూడా ఓన్ చేసుకోలేకపోతుంది.
ప్రయత్నాలు ముమ్మరం....
అందుకే సతీష్ రెడ్డిని పులివెందుల ఇన్ ఛార్జిగా నియమిస్తేనే మంచిదని ఆ జిల్లాకు చెందిన నేతలు కొందరు చంద్రబాబుకు సూచించారని తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం సతీష్ రెడ్డి పార్టీలోకి వచ్చినా టిక్కెట్ ఇచ్చేది లేదని, బీటెక్ రవికే టిక్కెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పార్టీలోకి వస్తే ఓకే. పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీ కూడా ఇవ్వనున్నారని తెలిసింది. మరి సతీష్ రెడ్డి అందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News