Summer Effect : ముదిరిన ఎండలు...మరింత పెరగనున్న ఉష్టోగ్రతలు
ఎండలు మరింత ఎక్కువయ్యాయి. శివరాత్రి వెళ్లిపోవడంతో చలి తగ్గి వేసవి తీవ్రత పెరిగింది;

ఎండలు మరింత ఎక్కువయ్యాయి. శివరాత్రి వెళ్లిపోవడంతో చలి తగ్గి వేసవి తీవ్రత పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి ఆరు గంటల వరకూ చల్లబడటం లేదు. దీంతో మార్చి మాసంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండంతో ఇక మే నెలలో ఎలా ఉంటాయన్న దానిపై వాతావరణ శాఖ అధికారులు సయితం అంచనాలుకు రాలేకపోతున్నారు.
అధిక ఉష్ణోగ్రతలు...
మార్చి నెలలోనే ఏపీ, తెలంగాణలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఏప్రిల్ నెల నాటికి నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉదయం పది గంటల నుంచి రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాధరణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇక ఎండల తీవ్రత పెరగడమే తప్ప తగ్గడం అనేది జరగదని కూడా అంటున్నారు.
వైద్యుల హెచ్చరిక...
అదే సమయంలో వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు పగటి వేళల్లో బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా తగినంత నీటిని నిరంతరం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువగా జ్వరం, ఒళ్లునొప్పులు వంటి వ్యాధులతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇళ్లలోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.