Water Project : నైరుతి వచ్చిందన్న మాటకానే.. నీరు ఏదీ.. నాట్లు వేసేది ఎలా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ప్రాజెక్టులలో నీరు లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు

Update: 2024-06-28 05:44 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి ముందే రాష్ట్రాలలోకి ప్రవేశించినప్పటికీ వర్షాలు సమృద్ధిగా పడటం లేదు. జూన్, జులై నెలలో కూడా ఇలాగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫానులు వస్తే తప్ప భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవన్నది వాతావరణ శాఖ చెబుతున్న మాట. ఇది అన్నదాతలకు ఆందోళనకు కలిగించే విషయం. ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరడం లేదు. సాగుచేద్దామంటే ధైర్యంచాలడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పడు తలెత్తాయని రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఖరీఫ్ సీజన్ లో...
నిజానికి ఏటా జూన్, జులై నాటికి భారీ వర్షాలు కురిసి జలకళను ప్రాజెక్టులు సంతరించుకుంటాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల కింద సాగయ్యే లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందాలంటే భారీ వర్షాలు పడి ప్రాజెక్టులు నిండాల్సిందే. కొన్ని సార్లు గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం ప్రకృతి కోపించిందనే అనుకోవాలి. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులలో నీరు తగినంతగా లేకపోవడంతో సాగు నీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జులై నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. అందుకోసం దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకోవాల్సిన సమయంలో నీరులేకపోవడంతో అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత నలభై ఏళ్లలో కృష్ణా నదిలో ఇంత తక్కువ నీరు ఎప్పుడూ లేదంటున్నారు.
భారీ వర్షాలు పడితే తప్ప...
నీరు ఈ ఏడాది అందడం కష‌్టమేనని చెబుతున్నారు. ఆగస్టు నెల నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ అప్పటికి ఏంజరుగుతుందోనన్న టెన్షన్ రైతుల్లో ఉంది. దుక్కులు దున్ని నాట్లు వేసుకుంటే నష్ట పోతామని ఆందోళన చెందుతున్నారు. అనేక ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో సమయానికి నీరు అందుతుందా? లేదా? అన్న టెన్షన్ మొదలయింది. అదే సమయంలో వర్షాలు కూడా చిరుజల్లులు పడి వెళుతున్నాయి. ఇది తమకు ఎంత మేరకు ఉపయోగపడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురిస్తే తప్ప జలాశయాలు నిండవు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితేనే కింద ఉన్న జలాశయాలకు నీరు చేరదు. మరి ఈ ఏడాది సాగు పై అనుమానపు మేఘాలు అలుముకున్నాయి.


Tags:    

Similar News