Tirumala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం కూడా తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలోనే ఉన్నారు

Update: 2024-08-28 02:58 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం కూడా తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఈరోజు భక్తుల సంఖ్య కొంత తగ్గినప్పటికీ దర్శనానికి మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమలలో ఇటీవల కాలంలో భక్తులు అధికంగా తరలి వస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రాకతో తిరుమల నిత్యం కిటకిటలాడిపోతుంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో రష్ అనేది తగ్గడం లేదు. ముందుగా దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు సాధారణ భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. శ్రావణ మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

14 కంపార్ట్‌మెంట్లలో...
తిరుమలలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో నీటి సమస్య కూడా తలెత్తుతుందని అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ కొళాయిలను తిరుమలలో బంద్ చేయడంపై భక్తులు నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పథ్నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,153 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,863 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.32 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News