Andhra Pradesh : జనసేనానికి కేంద్రం గుడ్ న్యూస్.. రాజకీయ అండకోసమేనా?

దసరా పండగ నాడు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా నిధులను విడుదల చేసింది. పవన్ కల్యాణ్ శాఖకు నిధులను కేటాయించింది

Update: 2024-10-12 13:23 GMT

దసరా పండగ నాడు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా నిధులను విడుదల చేసింది. పవన్ కల్యాణ్ శాఖకు నిధులను కేటాయించింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఈ నిధులను విడుదల చేసింది. స్థానిక సంస్థల అభివృద్ధికి ఈ నిధులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈనిధులను విడుదల చేసింది. ఒకరకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖకు ఈ నిధులను విడుదల చేయడం కూడా విశేషం. పవన్ పై మరోసారి కేంద్ర ప్రభుత్వం ప్రేమను చూపించిందనే చెప్పుకోవాలి. పదిహేనో ఆర్థిక సంఘం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ కు 593 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.

గ్రామాల అభివృద్ధికి...
ీఈ నిధులతో పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు నిధులను కేటాయించాలని చెప్పింది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పవన్ కల్యాణ్ పనిచేస్తుండటంతో ఆయనకు కొంత చేయూతగా ఈ నిధులు ఉపయోగపడతాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ నిధులు దోహదపడతాయని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ శాఖకు వెంట వెంటనే నిధులను కేటాయిస్తుండటం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ కు రాజకీయంగా అండగా నిలిచేందుకు, ప్రజల మద్దతు మరింతగా ఆయనకు పెరిగేందుకు ఈ నిధుల విడుదల ఎంతో ఉపయోగపడతాయన్న అంచనాలు వినపడుతున్నాయి.
రాజకీయ ప్రయోజనమేనా?
కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా ఏ పని చేయదని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పవన్ ను చూసి వరసగా గ్రామీణాభావృద్ధి కోసం పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి నిధులను కేటాయిస్తుందని చెబుతున్నారు. అందులో నిజానిజాలు కాసేపు పక్కన పెడితే పవన్ తో పాటు ఇది కూటమి ప్రభుత్వానికి కూడా లాభమే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి జరిగితే అది తన హయాంలో జరిగిందని చెప్పుకునే వీలుంటుంది. ఇది పవన్ ఒక్కరికే కాదని, తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రాజకీయంగా ఇది తమకు మంచిదేనని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
వరసగా నిధులను...
నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పిలక ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉంది. ఆయన మద్దతుతోనే ఢిల్లీలో పాలన నడుస్తుంది. ఆయన ఏమాత్రం అసంతృప్తి వ్యక్తం చేసినా రాజకీయంగా బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. అందుకే ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి పలు అంశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు కేటాయిస్తూ వస్తుంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం దక్కిందని అంటున్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.15000 కోట్లు సాయం అందించేందుకు సైతం కేంద్రం అంగీకరించడం కూడా ఇందులో భాగమే. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకారం అందిస్తోంది. విశాఖ రైల్వేజోన్ శంకుస్థాపన ముహూర్తం కూడా ఖరాయింది. డిసెంబరులో శంకుస్థాపన ఉంటుంది.


Tags:    

Similar News