Pawan Kalyan : పవన్ ఇలా మారిపోయారేంటి? ఎవరూ ఊహించి ఉండరే?

ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ కు.. ఫలితాల తర్వాత జనసేన అధినేతకు అసలు ఎక్కడా పొంతన కనిపించడం లేదు

Update: 2024-08-19 07:13 GMT

ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ కు.. ఫలితాల తర్వాత జనసేన అధినేతకు అసలు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఎంతటి సహనం.. ఎంతటి పరిణితి.. అసలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఒక్కసారిగా పవన్ కల్యాణ్ లో వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు దూకుడుగా, ఆవేశంతో ఊగిపోయే పవన్ కల్యాణ్ అధికారంలోకి రాగానే ఎక్కడా మాట తూలడం లేదు. కనీసం ఆవేశానికి చోటు కల్పించకుండా వస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించి నెలరోజులు మాత్రమే అవుతున్నప్పటికీ ఆయన చేస్తున్న సమీక్షలు, తనకు కేటాయించిన శాఖలపై ఆయన అధ్యయనం చేస్తున్న తీరును చూసి అనుభవం ఉన్న రాజకీయ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.

పంచాయతీ రాజ్ శాఖపైనే....
అనేక సార్లు మంత్రులుగా చేసిన వాళ్లు కూడా ఇలా అధ్యయనం చేస్తూ సమీక్షలు నిర్వహిస్తూ, అధికారులను ఆదేశాలు జారీ చేయడం వంటివి చేయడం లేదు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కావడంతో పవన్ కల్యాణ్ తనకు నచ్చిన అంశాలు కూడా అవ్వడంతో ఆయన పూర్తిగా అందులోనే లీనమయ్యారు. ఇతర విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం తన శాఖ, తన వద్దకు వచ్చిన సమస్యలను మాత్రమే ఆయన పరిష్కరించుకుంటూ వెళుతున్నారు. తమ సమస్యల కోసం పవన్ వద్దకు వెళితే చిటికెలో పరిష్కారం అవుతుందని భావించి ఎక్కువ మంది జనసేనానిని కలిసేందుకు ఎక్కువ మంది ప్రతి రోజూ తరలి వస్తున్నారు.
రాజకీయ విమర్శలపైన...
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల విషయంలోనూ ఆయన పెద్దగా స్పందించడం లేదు. గతంలో రాజకీయ విమర్శలు చేసే పవన్ కల్యాణ్ ఇప్పడు వాటి జోలికి పోవడం లేదు. పార్టీ కార్యకర్తలకు, నేతలకు కూడా సోషల్ మీడియాలో విపక్షాలపైన, విపక్ష నేతలకు సంబంధించిన వ్యక్తిగత అంశలపై స్పందించవద్దని ఆదేశాలు జారీ చేశారు. తాను.. తన శాఖ.. అభివృద్ధి... సమస్యల పరిష్కారం ఇంతవరకే పరిమితమయ్యారు. శాఖపై పూర్తిగా పట్టు సంపాదించేంత వరకూ ఆయన రాష్ట్ర పర్యటనకు కూడా వెళ్లదలచుకోలేదని చెబుతున్నారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే కొన్ని రోజులు వెళ్లి వచ్చిన పవన్ కల్యాణ్ ఎక్కువ సమయం విజయవాడలోనే ఉంటున్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమయినా ఆయన నాదెండ్ల మనోహర్, నాగబాబు వంటి వారికి ఆ పనిని అప్పగించారు కానీ తాను మాత్రం పంచాయతీ శాఖ నుంచి బయటకు రావడం లేదు. చంద్రబాబు తో కలసి నిధుల కోసం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేయలేదు.
చంద్రబాబును కలవకుండా.....
మరోవైపు ఉప ముఖ్యమంత్రి అయినా తాను కేవలం ఆ శాఖకు మాత్రమే పరిమితమయ్యారు తప్పించి.. కనీసం ఇతర శాఖల్లో కూడా వేలు పెట్టడం లేదు. కనీసం చంద్రబాబును కలిసినా తన శాఖకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రస్తావిస్తున్నారు. ఆయన మంత్రి వర్గ సమావేశంలోనూ, అంబానీ కుమారుడు వివాహంలోనూ చంద్రబాబుతో కలవడం మినహాయించి ప్రత్యేకించి తనంతట తాను వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి చర్చించేందుకు సముఖత చూపడం లేదు. ఇప్పుడు ధ్యాస అంతా పంచాయతీరాజ్ శాఖపైనే. అందుకే ఏరికోరి కేరళ కేడర్ కు చెందిన కృష్ణ తేజను తన ఓ.ఎస్.డీ.గా రప్పించుకున్నారు. ఆయనతో గ్రామీణ వ్యవస్థను మెరుగుపర్చడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారంటున్నారు. మొత్తం మీద పవన్ లో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతమంటూ పెద్దయెత్తున కూటమి పార్టీల్లోనూ చర్చ జరుగుతుంది.


Tags:    

Similar News