రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి.. అసలు నిజాలు ఇవి

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌ ఖైదీ మృతిచెందాడు. డెంగ్యూ కారణంతో ఆ ఖైదీ

Update: 2023-09-21 09:45 GMT

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌ ఖైదీ మృతిచెందాడు. డెంగ్యూ కారణంతో ఆ ఖైదీ మృతి చెందాడు. రిమాండ్‌ ఖైదీ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ మాట్లాడుతూ.. గంజేటి వీర వెంకట సత్యనారాయణ అనే యువకుడు దోపిడి కేసులో సెప్టెంబర్ 6వ తేదీన రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు. 7వ తేదీన రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జైలు అధికారులు చేర్పించారు. అత్యవసర వైద్య సహాయం నిమిత్తం ఈనెల 19వ తేదీన కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కానీ, డెంగ్యూతో ఈ నెల 20వ తేదీన సాయంత్రం రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. జైలుకు వచ్చేటప్పటికే సత్యనారాయణ జ్వరంతో బాధపడుతున్నాడని అధికారులు తెలిపారు. ప్లేట్ లెట్స్ సంఖ్య బాగా పడిపోవడమే అతడు చనిపోడానికి కారణమని తెలిపారు. అతడిని కాపాడడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారని.. అయితే ప్లేట్ లెట్స్ సంఖ్య లక్షా 50 వేలకు పడిపోయాయని స్పష్టం చేశారు. జైలులో దోమల నివారణకు ఆరోగ్యశాఖతో కలిసి చర్యలు చేపట్టామని.. ఫాగింగ్ కూడా చేశామని తెలిపారు.

ఇదే జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ డెంగ్యూ వ్యాధితో చనిపోయాడని.. ఇందుకు సంబంధించి చంద్రబాబు నాయుడు భద్రత, ఆరోగ్యంపై మాకూ ఆందోళన నెలకొందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతకు అవసరమైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జైలులోనే చంద్రబాబును చంపే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని లోకేష్ అన్నారు. ఆధారాలు లేని కేసులో బెయిల్ రాకుండా జెల్ లోనే చంపేందుకు పెద్ద ప్లాన్ వేశారంటూ లోకేష్ ఆరోపించారు. జైలులో దోమలు కుడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని లోకేష్ ఆరోపించారు. అదే జైలులో రిమాండ్ ఖైదీ డెంగ్యూ వాధితో మరణించారని గుర్తు చేశారు. చంద్రబాబును కూడా ఇలాగే చంపేయాలని జగన్ కుతంత్రాలు చేస్తున్నాడని ఆరోపించారు.


Tags:    

Similar News