Telangana : గోల్కోండ కొట వేదికగా రేపు గుడ్ న్యూస్ చెప్పనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలిసింది.

Update: 2024-08-14 04:27 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలిసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభవార్త చెప్పే అవకాశముంది. రేపు గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఈ సందర్బంగా రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయననున్నట్లు సమాచారం. కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయింది. కొన్ని ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం లక్షల సంఖ్యలో ప్రజలు ఎదురు చూస్తున్నారు. వారందరికీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున అనుకూలమైన వార్తను చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

కొన్ని ఏళ్ల నుంచి...
తెలంగాణలో ఆరేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే దీనిపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని కూడా నియమించింది. ఇటీవల సమావేశమైన మంత్రి వర్గ ఉప సంఘం కొంత మేర దీనిపై చర్చించి కొన్ని నిబంధనలను రూపొందించినట్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల వార్షికాదాయం ఉన్న వారికి తెలుపు రంగు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఉప సంఘం సిఫార్సు చేసినట్లు తెలిసింది. అలాగే మాగాణి భూమి మూడు ఎకరాలు, మెట్ట ఏడు ఎకరాలుంటే అర్హులుగా పరిగణించాలని నిర్ణయించారు.
రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై...
దీంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తెలంగాణలో వేగవంతం చేసేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం మంచిదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. నిరుపేదలకు మాత్రమే సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందించాలని నిర్ణయానికి వచ్చింది. అందుకే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కొన్ని హామీలను రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తికాకపోవడంతో వాటిని అమలు చేయలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ అయితే వాటి ప్రకారం ప్రభుత్వ పధకాలను మంజూరు చేయవచ్చు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, గృహజ్యోతి వంటి పథకాలను అమలు చేసే వీలుంటుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. దీంతో రేపు గోల్కొండ కోటలో రేవంత్ రెడ్డి ప్రసంగంలో రేషన్ కార్డుల ప్రస్తావన ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News