Vijaywada : బెజవాడకు ఎంత కష్టమొచ్చింది? నష్టం అంచనాలు వేయడమూ కష్టంగానే ఉందిగా?

వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడ గత నాలుగు రోజుల నుంచి వ్యాపారాలన్నీ కోల్పోయాయి. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

Update: 2024-09-04 08:27 GMT

అవును విజయవాడకు వచ్చిన కష‌్టం మామూలుది కాదు. వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడ గత నాలుగు రోజుల నుంచి వ్యాపారాలన్నీ కోల్పోయాయి. ఒకటి కాదు రెండు కాదు.. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. నష్టం అంచనా వేయడానికి కూడా కూడా అవకాశం లేకుండా పోయింది. నాలుగు రోజుల నుంచి పడిన భారీ వర్షాలు... ప్రకాశం బ్యారేజీ నుంచి పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా విడుదల కావడంతో విజయవాడ సగం మునిగిపోయింది. మునగడం అంటే మామూలుగా కాదు... నీళ్లలోకి నీరు చేరింది. మొదటి అంతస్తులోకి కూడా నీరు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే తెలుస్తుంది.

లారీల యజమానులు...
విజయవాడ అంటేనే ముందుగానే గుర్తుకు వచ్చేది లారీలు. లారీలు, బస్సులు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. లారీలు సరుకులను తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తుంటాయి. కొన్ని వేల సంఖ్యలో లారీలు నాలుగు రోజులు స్టాండ్ లలోనే ఉన్నాయి. దీంతో తమకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని లారీ యజమానుల సంఘం చెబుతుంది. ఒక్క లారీ కూడా కదలలేని పరిస్థితి. రహదారులన్నీ జలమయం కావడంతో పాటు జాతీయ రహదారులపైకి కూడా నీరు చేరడం, అనేక చోట్ల గండ్లు పడటంతో లారీలన్నీ నిలిచిపోయి తమకు లక్షల రూపాయల్లో నష్టం తెచ్చిపెట్టిందని, దీనిని పూడ్చేదెవరని వారు ప్రశ్నిస్తున్నారు.
కాళేశ్వరరావు మార్కెట్...
ఇక ప్రయివేటు బస్సులు కూడా అంతే. ప్రయివేటు బస్సు సంస్థలు విజయవాడ కేంద్రంగా ఎక్కువగా తిరుగుతున్నాయి. ట్రావెల్స్ సంస్థలు అన్నీ నాలుగు రోజులు మూతపడ్డాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో తమకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇక కాళేశ్వరరావు మార్కెట్ కోస్తాంధ్రలోనే అతి పెద్ద మార్కెట్. హోల్ సేల్ వ్యాపారాలున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకుని వెళుతుంటారు. కానీ ఆ మార్కెట్ పూర్తిగా నాలుగు రోజుల నుంచి మూతపడి పోయింది. వ్యాపార సంస్థలు గేట్లుకూడా తెరవడం లేదు. ఈ నష్టం కోట్లలో ఉంటుందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
ఫుడ్ బిజెనెస్ నిల్....
విజయవాడ ఫుడ్ బిజినెస్ కు ఫేమస్. పర్యాటకులతో పాటు ప్రతి రోజూ విజయవాడకు వచ్చే వారితో హోటళ్లన్నీ కళకళలాడుతుంటాయి. కానీ భారీ వర్షాలు, వరదలతో ఈ బిజినెస్ కూడా పూర్తిగా దెబ్బతినింది. దాదాపు ప్రతి హోటల్ లో ఇదే పరిస్థితి. కనీసం పట్టుమని పది మంది కూడా హోటల్ కు వచ్చి భోజనం చేయలేదని వారు చెబుతున్నారు. ఇక లాడ్జీలు మాత్రం కొంత నిండిపోయాయి. విల్లాల్లోకి, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు రావడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడం, మంచి నీటి సౌకర్యం కూడా లేకపోవడంతో విజయవాడకు చెందిన సంపన్నులు మాత్రం లాడ్జిలకు వచ్చి తలదాచుకున్నారు. నేడు నీరు తగ్గడంతో వారి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మొత్తం మీద బెజవాడలో వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి.


Tags:    

Similar News