ఏపీ ప్రజలకు హెచ్చరిక..!

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దవుతూ ఉన్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం

Update: 2023-07-25 02:20 GMT

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దవుతూ ఉన్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా, బుధవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. దీంతో పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఎల్లుండి భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఐఎండీ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. బుధవారం నాటికి వాయుగుండంగా బలపడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం ఆ తర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందంటున్నారు. మంగళవారం నాడు రాష్ట్రంలో మూడు రోజులు విస్తారంగా వానలు పడనున్నట్లు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు.

సోమవరం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం పొలవరం దగ్గర నీటిమట్టం 11.8 మీటర్లు ఉండగా.. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.12 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం కూనవరం ,పి.గన్నవరంలో 2ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మామిడికుదురు, అయినవిల్లి, కుకునూర్, వేలేర్పాడులో 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News