బూచేపల్లి ఇలా రివర్స్ అయ్యాడే?

ఆయన ఎన్నికల సమయంలో చేతులెత్తేశాడు. 2014 నుంచి పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామన్నా తనకు వద్దే వద్దన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన [more]

Update: 2020-08-17 14:30 GMT

ఆయన ఎన్నికల సమయంలో చేతులెత్తేశాడు. 2014 నుంచి పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామన్నా తనకు వద్దే వద్దన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా తనదేనంటున్నాడు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు వరకూ ఆయన పోటీకి దిగేందుకే అంగీకరించలేదు. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులందినట్లు తెలుస్తోంది.

పట్టున్న ప్రాంతంలో…..

బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి 2004లో దర్శి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన జరగడంతో ఈయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావు చేతిలో ఓటమి పాలయ్యారు.

పోటీ చేయనని చెప్పి….

20014 నుంచి శివప్రసాద్ రెడ్డి గాయబ్ అయ్యారు. దీనికి ఆర్థికంగా ఇబ్బందులతో పాటు కుటుంబంలో తలెత్తిన వివాదాలు కారణమంటారు. తాను 2019 ఎన్నికల్లో పోటీ చేయనని నేరుగా జగన్ కే తెలిపారు. దీంతో జగన్ చివరి నిమిషంలో మద్దిశెట్టి వేణుగోపాల్ కు టిక్కెట్ ఇచ్చారు. ఆయన గెలుపొందారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో తన మాటే నియోజకవర్గంలో చెల్లుబాటు కావాలంటున్నారు బూచేపల్లి శిపవ్రసాద్ రెడ్డి. అధికారుల బదిలీలు, కాంట్రాక్టులన్నీ తన అనుచరులకే దక్కాలని పట్టుబడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.

అధికారంలోకి రాగానే…?

ఒకరికి పోటీగా మరొకరు మీడియా సమావేశాలు పెట్టి మరీ తిట్టుకుంటున్నారు. మొగిలిగుండ్ల రిజర్వాయర్, దర్శిలోని నీటి సంఘాల కంట్రాక్ట్ పనుల టెండర్లలో తలెత్తిన విభేదాలు ఇద్దరి మధ్య నిప్పురాజేశాయంటున్నారు. దీంతో ఎమ్మెల్యే ఫ్లెక్సీలను కూడా ఇటీవల చించివేయడంతో రగడ రోడ్డున పడింది. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇరు వర్గాలుకు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేదు. అయినా ఎన్నికలంటే భయపడి బరినుంచి తప్పుకునే వారు ఇప్పుడు జోక్యం చేసుకోవడమేంటని ఎమ్మెల్యే వర్గం ప్రశ్నిస్తుంది. మొత్తం మీద దర్శి నియోజకవర్గంలో వైసీపీలో నెలకొన్న విభేదాలు వీధిన పడకముందే అధిష్టానం సర్దుబాటు చేయడం పార్టీకి మంచిది. లేకుంటే ఇక్కడ పార్టీ నిలదొక్కుకోవడం కష్టమే.

Tags:    

Similar News