అప్పకు అండగా నిలబడతారా?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మోదీ పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మోదీ ఈ నెల 3వ తేదీన కర్ణాటకలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. 2,3తేదీల్లో ప్రధాని [more]

Update: 2020-01-02 18:29 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మోదీ పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మోదీ ఈ నెల 3వ తేదీన కర్ణాటకలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. 2,3తేదీల్లో ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటకలోనే ఉంటారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప మోదీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మోదీ కన్నడనాట వరాల జల్లు కురిపించాలని ఆయన నమ్మకం పెట్టుకున్నారు. మోదీ పర్యటన ఏర్పాట్లు చూస్తూనే యడ్యూరప్ప ఇటు బీజేపీ కేంద్ర నాయకత్వంతోనూ సంప్రదిస్తున్నారు.

తొలిసారి మోదీ….

కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత తొలిసారి నరేంద్ర మోదీ కర్ణాటక వస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి కూడా మోదీ దూరంగా ఉన్నారు. యడ్యూరప్ప ఒక్కరే ఉప ఎన్నికలను పూర్తి చేసుకుని తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వరదల తాకిడికి గురై తీవ్రంగా నష్టపోయిన కన్నడ రాష్ట్రాన్ని మోదీ ఆదుకుంటారని యడ్యూరప్ప భావిస్తున్నారు. వరదల సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం అందలేదని విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

వరద సాయంపై….

నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటుండటంతో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై వరద సాయంపై యడ్యూరప్ప మాట్లాడే అవకాశముంది. ప్రభుత్వం ఏర్పాటు కావడం, వివిధ ప్రాంతాల్లో ఇంకా నేటికీ వరద సాయం అందకపోవడాన్ని ఆయన ప్రధాని దృష్టికి తీసుకొచ్చే అవకాశముంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఎలాంటి హామీ వస్తుందోనన్న టెన్షన్ కూడా యడ్యూరప్పలో లేకపోలేదు.

విస్తరణపై కూడా…..

దీంతో పాటు మంత్రి వర్గ విస్తరణ విషయంలో కూడా మోదీతో చర్చించే అవకాశాలున్నాయి. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇంతవరకూ కేంద్ర నాయకత్వం నుంచి మంత్రి వర్గ విస్తరణకు అనుమతి లభించలేదు. దీంతో మంత్రి వర్గ స్థానాల కోసం ఆశలు పెట్టుకున్న వారిలో నైరాశ్యం కనపడుతోంది. వీలయినంత తర్వగా మంత్రి వర్గ విస్తరణకు అనుమతి ఇవ్వాలని కూడా యడ్యూరప్ప ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద యడ్యూరప్ప మోదీ పర్యటనను తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News