ఫుల్ గా తాగేసి వచ్చిన మహిళా టీచర్.. క్లాస్ రూమ్ లో ఏమి చేసిందంటే..?

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్తీ భగత్ కూడా పలు సందర్భాల్లో ఆమెను హెచ్చరించారని బీఈవో తెలిపారు.

Update: 2022-07-23 16:56 GMT

సార్ ఫుల్ గా మందు కొట్టి.. క్లాస్‌రూమ్‌లలో సందడి చేసిన సంఘటనలు గతంలో పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. అయితే, క్లాస్‌రూమ్‌లో ఓ మహిళా టీచర్ మద్యం మత్తులో కనిపించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అధికారులు తనిఖీలకు రాగా మహిళా టీచర్ పడుకుని కనిపించింది. పాపం ఒంట్లో బాగోలేదేమోనని అధికారులు అనుకున్నారు. కానీ తమ టీచర్ మద్యం సేవించి వచ్చిందని పిల్లలు చెప్పడంతో అందరూ షాకయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ బ్లాక్‌లోని ఒక పాఠశాలలో విద్యాశాఖ అధికారి నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో, ఒక మహిళా ఉపాధ్యాయురాలు క్లాస్‌రూమ్ నేలపై పడుకుని ఉంది. చుట్టూ ఉన్న పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. రాయ్‌పూర్‌కు 430 కిలోమీటర్ల దూరంలోని జష్‌పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ శివార్లలోని టికైత్‌గంజ్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
జష్‌పూర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో) ఎంజీయూ సిద్ధిక్ గురువారం ఉదయం 11 గంటలకు పాఠశాలకు వెళ్లి సాధారణ తనిఖీ చేయగా ఆమె మత్తుగా నేలపై పడి ఉంది. "పిల్లలు ఆడుకుంటుండగా తరగతి గదిలో నేలపై పడి ఉన్న టీచర్‌ని చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. మొదట్లో ఆమె అనారోగ్యానికి గురైందని అనుకున్నాను. తరగతి గదిలో ఉన్న 3, 4 తరగతుల పిల్లలతో నేను ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తే.. నేను మరింత షాక్ అయ్యాను. లేడీ టీచర్ జగపతి భగత్ మద్యం తాగిందని పిల్లలు చెప్పారు. ఆమె కుర్చీలో కూర్చోవడానికి సహాయం చేయమని నేను పిల్లలను అడిగాను" అని సిద్దిక్ మీడియాకి చెప్పారు. పాఠశాలలో 54 మంది విద్యార్థులు ఉండగా జగపతి భగత్ అనే ఉపాధ్యాయురాలు అన్ని సబ్జెక్టులను బోధించాల్సి ఉంది. బీఈవో అదనపు ఎస్పీ ప్రతిభాపాండేకు ఫోన్‌ చేసి జరిగిన ఘటన గురించి తెలిపారు. ఆ తర్వాత టీచర్‌ని మెడికల్ చెకప్‌కి పంపేందుకు కానిస్టేబుళ్లను పంపమని కోరారు. ఏఎస్పీ, బీఈవో ఆదేశాల మేరకు వెంటనే ఇద్దరు పోలీసులను పాఠశాలకు పంపించి ఆమెను పోలీసు వ్యాన్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు భగత్‌ను పరీక్షించి, ఆమె రక్తంలో ఆల్కహాల్‌ ఉండటంతో.. మద్యం తీసుకున్నట్లు నిర్ధారించారని సిద్ధిక్‌ తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి భగత్‌ను సస్పెండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆమె మద్యం మత్తులో పాఠశాలకు వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారని, ఈ అలవాటు మానుకోవాలని పాఠశాల కమిటీ భగత్‌ను హెచ్చరించినా ఆమె మారలేదని విద్యాశాఖ అధికారి తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్తీ భగత్ కూడా పలు సందర్భాల్లో ఆమెను హెచ్చరించారని బీఈవో తెలిపారు.జూన్ 16న అకడమిక్ సెషన్ ప్రారంభమైనప్పటి నుండి జష్‌పూర్ జిల్లాలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఐదుగురు టీచర్లలో ముగ్గురు తాగి పాఠశాలకు వచ్చినందుకు సస్పెండ్ చేసినట్లు DEO కార్యాలయం తెలిపింది.


Tags:    

Similar News