Vegetables : కూరగాయలు ఫ్రీ... ఎగబడిన జనం

ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. అయితే పెద్దపల్లి మార్కెట్ లో కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు

Update: 2024-08-27 05:37 GMT

ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. టమాటా ధర గతంలో కంటే కొంత తగ్గినప్పటికీ మిగిలిన కూరగాయల ధరలు మాత్రం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బెండకాయలు, దొండకాయలు, ఆలుగడ్డ, చిక్కుడు కాయ, వంకాయ, పొట్లకాయ వంటి కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. గతం కంటే కిలోపై ఇరవై నుంచి ముప్ఫయి రూపాయల ధరలు పెరగడంతో కొనుగోలుదారు తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు కూడా చెబుతున్నారు.

పెద్దపల్లి మార్కెట్ లో...
అయితే ఈ మార్కెట్‌లో కూరగాయల ధరలు ఉచితంగా వినియోగదారులకు అందచేశారు. ఇది నిజం. ఎక్కడంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో అన్ని కూరగాయలను ఉచితంగా అందించారు. ఎందుకయ్యా అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఉచితంగా కూరగాయలు ఇస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు పెద్దపల్లి మార్కెట్ కు క్యూ కట్టారు. మార్కెట్ కు వచ్చిన వారందరికీ ఉచితంగానే కూరగాయలు ఇవ్వడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోజూ ఉచితంగా కూరగాయలు ఇస్తే నెలకు రెండు వేల రూపాయల వరకూ మిగులుతుందని అనుకుంటున్నా కానీ ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్.
వివాదమే కారణం...
ఉచితంగా కూరగాయలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దపల్లి మార్కెట్ లో హోల్‌సేల్, రిటైల్ కూరగాయల మధ్య నెలకొన్న విభేదాలే. రిటైల్ గా కూరగాయలు అమ్మవద్దంటూ హోల్‌సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులను అడ్డుకున్నారు. ఇది వివాదంగా మారింది. రిటైల్ లెక్కన అమ్మవద్దంటూ ఆంక్షలు పెట్టారు. రిటైర్ వ్యాపారులు మాత్రం తాము సరుకును విక్రయించుకోవాలంటే కిలోలు, రెండు కిలోలు కూడా అమ్ముతామని చెప్పారు. దీనికి హోల్‌సేల్ వ్యాపారులు అంగీకరించకపోవడంతో రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు ఉచితంగా కూరగాయలు ఇచ్చి పంపారు. ఉచితంగా కూరగాయలు పంచిపెడుతున్నారని తెలియడంతో ప్రజలు పెద్దయెత్తున మార్కెట్ కు క్యూకట్టారు.


Tags:    

Similar News