'ఆ హామీలన్నీ ఏమయ్యాయి'.. ప్రధాని పై కేటీఆర్ ఫైర్‌

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు

Update: 2023-06-30 13:43 GMT

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం డిమాండ్ చేశారు. రాబోయే వరంగల్ పర్యటనలో ప్రధాని ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో వివరించాలని అన్నారు. కాజీపేటలో రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇచ్చినా ఎందుకు ఇవ్వలేదో మోదీ తెలంగాణ ప్రజలకు చెప్పాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పోడు భూముల పంపిణీని ప్రారంభించిన అనంతరం మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. రైల్‌కోచ్‌ల తయారీ కర్మాగారానికి బదులు రైలు కోచ్‌ల మరమ్మతుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.

కాజీపేటలో రైల్వే కోచ్ పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ సదుపాయానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని జూలై 12న తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. ప్రధాని మోడీ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రైల్ కోచ్ ఫ్యాక్టరీని మోదీ నిరాకరించారని, అయితే గుజరాత్‌లో రూ.21 వేల కోట్లతో రైల్ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పారని అన్నారు. తెలంగాణకు ఒక రూల్‌, గుజరాత్‌కు మరో రూల్‌ సరికాదని అన్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌కే కాదు యావత్ దేశానికి చెందిన వ్యక్తి అని ఆయన అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంలో ప్రధాని ఎందుకు విఫలమయ్యారో కూడా ప్రజలకు చెప్పాలని కేటీఆర్ అన్నారు.

యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగులో 360 ఎకరాల భూమిని కేటాయించినా, యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం చేసిన హామీ ఏమైందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలను నమ్మవద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ప్రజలను కోరారు. 50 ఏళ్లుగా ప్రజలను మోసం చేసిన పార్టీ మరోసారి అధికారం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టేందుకు మరోసారి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News