Tirumala : తిరుమలలో శనివారం కూడా రద్దీ తగ్గడానికి రీజన్ ఇదేనా?

తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది. శనివారం అయినా కూడా భక్తులు స్వల్ప సంఖ్యలోనే తిరుమలకు వచ్చారు.

Update: 2024-09-28 03:03 GMT

తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది. శనివారం అయినా కూడా భక్తులు స్వల్ప సంఖ్యలోనే తిరుమలకు వచ్చారు. దసరా సెలవులు, బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు తిరుమల పర్యటనను అప్పటికి వాయిదా వేసుకుని ఉండవచ్చు. దీంతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు కూడా తిరుమలపై ప్రభావం చూపిందంటున్నారు. సాధారణంగా శనివారం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని అందరూ భావిస్తారు. అందుకే శనివారం నాడు విపరీతమైన రద్దీ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం పెద్దగా రష్ లేకపోవడంతో భక్తులు సులువుగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పెద్దగా కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. వసతి గృహాల కేటాయింపు కూడా వేగంగా వెంట వెంటనే జరుగుతుండటంతో పెద్దగా వేచి ఉండకుండానే గదులను భక్తులు పొందుతున్నారు. అన్నదానం వద్ద కూడా భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే కనపడుతుంది.

ఎనిమిది గంటల్లో...
తిరుమలలో శనివారం అంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. కానీ ఈ శనివారం మాత్రం రష్ పెద్దగా లేకపోవడంపై అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పన్నెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం మూడు గంటల్లోనే పూర్తవుతుంది. మూడు వందల రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,158 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరలో 24,938 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చిందని, ఈ నెలలో అత్యంత తక్కువగా నిన్ననే హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News