Tirumala : భక్తులు తగ్గడంతో లడ్డూల నిల్వలు పెరిగి.. తిరుమలలో తగ్గిన భక్తుల సంఖ్య

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది

Update: 2024-09-06 02:00 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో భక్తుల సంఖ్య తిరుమలలో ఉండటం ఇదే తొలిసారి అని టీటీడీ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో రవాణా వ్యవస్థ కు ఇబ్బంది కలగడంతో పాటు అనేక రైళ్లు రద్దయ్యాయి. అదే సమయంలో రోడ్డు ప్రయాణం భారీ వర్షాలతో ప్రమాదకరమని భావించి తమ తిరుమల పర్యటనను భక్తులు రద్దు చేసుకున్నారు. అందుకే ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు కూడా తిరుమలకు చేరుకోలేకపోతున్నారు. ఇక తిరుపతికి చుట్లుపక్కల జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఎక్కువ మంది భక్తులు తిరుమలను సందర్శించుకుంటారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మరికొద్ది రోజులు ఇదే రకంగా ఉండనుంది. రేపు శనివారం, ఆదివారం కూడా భక్తుల రద్దీ పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎనిమిది గంటల సమయం....
భక్తుల రద్దీ తగ్గిపోవడంతో లడ్డూ నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో అధికారులు ఆధార్ కార్డుపై పది లడ్డూలను అధికారులు ఇస్తున్నారని అధికారులు తెలియజేశారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు గంట నుంచి రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 61,142 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,525 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.20 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News