Tirumala : తిరుమలలో నేడు అదిరిపోయే రష్.. భక్తుల క్యూ లైన్ ఎంత పొడవంటే?

నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది

Update: 2024-09-20 02:51 GMT

నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. రేపు, ఎల్లుండి అంటే శని, ఆదివారాలు రష్ మరింత పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద క్యూ లైన్లతో పాటు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలను టీటీడీ అధికారులు తీసుకుంటున్నారు. గత కొంత కాలంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు చేస్తూ అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వసతి గృహాల వద్ద కూడా పెద్దగా వేచి ఉండకుండానే వెంటనే గదులు కేటాయింపు జరిగేలా అధికారులు చర్యలకు దిగారు. దీంతో పాటు అన్నదానం వద్ద కూడా రద్దీని తగ్గించడానికి తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. తిరుమలలో ఇటీవల కాలంలో వరస సెలవులు రావడంతో పాటు రద్దీ ఒక్కసారిగా పెరగడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమై అందుకు తగిన చర్యలకు దిగారు.

బయట వరకూ...
తిరుమల వెంకేటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధానంగా ఈ నెలలో ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ బయట కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకూ ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,835 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,883 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.96 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News