Tirumala : నమో వెంకటేశాయ... కనిపించవయ్యా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

Update: 2024-07-19 02:55 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. శుక్ర, శని, ఆదివారాలు సాధారణంగా భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే ఉంటుంది. తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాలను అందచేస్తున్నారు. శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను భక్తులకు ఇస్తున్నారు. మంచినీరు, మజ్జిగ సరఫరా చేస్తూ భక్తులు క్యూ లైన్ లో ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారడంతో భక్తులు బయటే వేచి చూస్తుండటం కనిపిస్తుంది.

ఇరవై గంటలు...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ టీబీసీ కాంప్లెక్స్ వరకూ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్వనం ఇరవై గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,223 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,549 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News