Tirumala : తిరుమలలో ఈరోజు మళ్లీ పెరిగిన రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2024-10-18 02:36 GMT

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు తగ్గడంతో పాటు వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో భక్తుల తాకిడి ఈరోజు ఎక్కువగా ఉంది. తిరుమలలో వాతావరణం కొంత చల్లగా ఉన్నప్పటికీ వర్షం కురియడం లేదు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వీధులన్నీ భక్తులతో కిటికటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులే. తలనీలాలను సమర్పించే చోట కూడా రష్ కొనసాగుతుంది. వసతి గృహాలు దొరకడానికి కూడా గంటల సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ భక్తులు ఏదో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అన్నదాన సత్రం కూడా భక్తుల రద్దీ ఈరోజు ఉదయం నుంచి ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు శని, ఎల్లుండి ఆదివారాలు కావడంతో మూడు రోజుల పాటు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

నిన్న ఆదాయం...
తిరుమలలో ఈ మూడు రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగుతుందని, అందుకే అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. శ్రీవారి మెట్ల నడక మార్గాన్ని కూడా పునరుద్ధరించారు. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాపవినాశనం, కళాతోరణం వంటివి మళ్లీ తెరుచుకోవడంతో భక్తులు అక్కడకు చేరుకుని స్నానమాచరిస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇరవై ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్ ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,637 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,956 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.69 కోట్ల రూపాయల వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News