Vijaya Sai Reddy : రాజీనామాకు కారణం చెప్పిన సాయిరెడ్డి.. బలమైనదేగా?
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన రాజీనామాకు గల కారణాలను వివరించారు.;

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని చెప్పారు. జగన్తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశానని చెప్పారు. భవిష్యత్లో రాజకీయాల గురించి మాట్లాడనన్న ఆయన తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్గా మారలేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
వెన్నుపోటు రాజకీయాలు...
వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవన్న విజయసాయిరెడ్డి కాకినాడ పోర్ట్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని చెప్పారు. తాను దేవుడిని నమ్మానని, నమ్మక ద్రోహం చేయనని, తన లాంటి వాళ్లు వెయ్యి మంది పోయినా జగన్కు ప్రజాదరణ తగ్గదని విజయసాయిరెడ్డి అన్నారు. తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగతంమన్న విజయసాయి రెడ్డి తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరని, ఇప్పుడు వేరని అన్నారు. కేసుల మాఫీ కోసమే తాను రాజీనామా చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని, ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం.. తనకు ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. బీజేపీలో చేరడం కానీ, ఏ పదవి తీసుకోవడం కానీ జరగదని, నా రాజీనామా వల్ల రాజ్యసభ సీటు.. కూటమికి వెళ్తుందని విజయ సాయి రెడ్డి తెలిపారు.