Ys Jagan : చంద్రబాబు దెబ్బకు జగన్ విలవిల లాడిపోతున్నారా? కొట్టాల్సిన చోట కొట్టారా?

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ముందు జగన్ తేలిపోతున్నట్లే కనిపిస్తుంది.

Update: 2024-09-21 05:56 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ముందు జగన్ తేలిపోతున్నట్లే కనిపిస్తుంది. చంద్రబాబు తన యాభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మొత్తం బయటకు తీసి పక్కాగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఈ గేమ్ లో జగన్ ఇరుక్కుని పీక్కోలేక.. లాక్కోలేక విలవిలలాడిపోతున్నారు. చంద్రబాబు వేసిన ట్రాప్ కు జగన్ కు మైండ్ బ్లాంక్ అయిది. దేశ వ్యాప్తంగా ఇటు జాతీయ మీడియాతో పాటు జాతీయ స్థాయి నేతల్లోనూ, దేశ వ్యాప్తంగానూ జగన్ పార్టీ పలుచన పాలయింది. వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు వదిలిన బాణం నుంచి జగన్ ను బాగానే దెబ్బతీసిందనే చెప్పాలి. తిరుమల లడ్డూ వివాదాన్ని తానే లేపి దేశ వ్యాప్తంగా చర్చకు చంద్రబాబు తెరతీయడంతో రాజకీయంగా, పార్టీ పరంగా జగన్ విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తుంది.

తిరుమల లడ్డూ వివాదం...
లక్ష కోట్ల అవినీతి చేశారన్నా జగన్ ను అందలం ఎక్కించిన ప్రజలు తిరుమల శ్రీవారి సెంటిమెంట్ తో కొట్టేసరికి సోషల్ మీడియాలో సయితం జగన్ పార్టీకి వ్యతిరేకంగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారంటే ఏ స్థాయిలో తిరుమల లడ్డూల అంశం అంటుకుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇటు మిత్ర పక్షాలనే కాదు అటు అన్ని వర్గాల వారిని జగన్ కు దూరం చేసే ప్రయత్నంలో చంద్రబాబు తొలి అడుగులోనే సక్సెస్ అయ్యారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే నిజం దేవుడికే తెలియాలి కానీ.. జనాల దృష్టిలో మాత్రం నాటి జగన్ ప్రభుత్వం దోషిగా మిగిలిందనే చెప్పాలి. తిరుమల బాలాజీకి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులున్నారు. హిందువులు ఆరాధించే దైవం కావడంతో ఈ వివాదం వారిని సెంటిమెంట్ గా జగన్ ప్రభుత్వాన్ని విలన్ గా మార్చింది.
సెంటిమెంట్ బలంగా మారి...
ఒకవైపు పార్టీ నేతలు వెళ్లిపోతున్నారు. ఆ సానుభూతి జగన్ కు దక్కేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పడు వైసీపీ నేతలు పార్టీ మారడం కంటే తిరుమల లడ్డూయే ప్రధాన టాపిక్ గా మారింది.తిరుపతి లడ్డూ వివాదంలో చంద్రబాబు నాయుడు చాలా పకడ్బందీగా పీకల్లోతుల్లో వైసీపీ కూరుకుపోయేలా చేయగలిగారు. చంద్రబాబు నాయుడు అంటే ఏందో యువకుడైన జగన్ తొలి సారి కంగారు పడాల్సి వచ్చింది. అందుకే ఆయన మీడియా సమావేశంలో ఇది ధర్మమేనా? న్యాయమేనా? అంటూ ప్రశ్నించడం చూస్తుంటే జగన్ దైన్య స్థితి ఏంటో చెప్పకనే తెలుస్తోంది. వైసీీపీనేతల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. మనోడు తప్పు చేశారా? అన్న అనుమానాన్ని అయితే అందరిలోనూ రేకెత్తించగలిగి చంద్రబాబు జగన్ పార్టీని చావు దెబ్బ కొట్టారు.
షాక్ ట్రీట్ మెంట్‌తో...
తిరుమల లడ్డూల వివాదం నుంచి తేరుకోవడానికి జగన్ కు చాలా సమయం పట్టే అవకాశముంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్ అవసరం లేదు. చంద్రబాబుతో పొత్తు ఉంది. అంతే కాదు చంద్రబాబు మద్దతు కూడా ఆ పార్టీకి అవసరం. అందుకే అది కూడా జగన్ కు పరోక్షంగా అయినా సహకరించే అవకాశం లేదు. టీటీడీ బోర్డులో తన బంధువులను, తన సామాజికవర్గానికి చెందిన వారినే నియమించి జగన్ పెద్ద తప్పు చేశారన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అలాగే అధికారులు కూడా అదే సామాజికవర్గం కావడంతో జగన్ కు తిరుమల లడ్డూల వ్యవహారం శిరోభారంగా మారనుంది. ప్రజల బలమైన సెంటిమెంట్ కావడం, అవినీతి కంటే క్షమించరాని నేరంగా భావిస్తుండటం వల్లనే జగన్ లో బెరుకు కనిపిస్తుంది. జగన్ ఎన్నడూ లేనిది బేలగా కనిపించడం చూస్తే చంద్రబాబు ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్ నుంచి కోలుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. భవిష్యత్ లో ఏం జరుగుతుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం.


Tags:    

Similar News