Ys Jagan : వైఎస్ కుటుంబంలో విభేదాలు పీక్ కు... ఇక కోర్టులోనే అంటున్న జగన్

షర్మిల, విజయమ్మలపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది

Update: 2024-10-23 04:09 GMT

సరస్వతి పవర్ షేర్స్ వివాదానికి సంబంధించి సోదరి షర్మిల, తల్లి విజయమ్మలపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కుటుంబ కలహాల కారణంగా వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతిలు జగన్ సోదరి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.

పిటీషన్ లో ఏముందంటే?
ఈ పిటిషన్‌లో తెలంగాణలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, సౌత్ ఈస్ట్ రీజియన్ రీజినల్ డైరెక్టర్‌తో సహా జనార్దన రెడ్డి చాగరి, యశ్వంత్‌రెడ్డి కేతిరెడ్డి ఇతర ప్రతివాదుల పేర్లు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 10న ఎన్‌సిఎల్‌టిలో జాబితా చేసిన ఈ కేసు కంపెనీల చట్టంలోని సెక్షన్ 59 కింద దాఖలు చేశారు. ఇది సభ్యుల రిజిస్టర్‌ను సరిదిద్దడానికి సంబంధించినది. ఈ నిబంధన ప్రకారం, ఒక వ్యక్తి పేరు తగిన కారణం లేకుండా కంపెనీ సభ్యుల రిజిస్టర్‌లో నమోదు చేసినా లేదా దాని నుండి తొలగించినా, బాధిత పక్షం సరిదిద్దడానికి అప్పీల్‌ను దాఖలు చేయవచ్చు.
తనపై చేసిన విమర్శలకు...
జగన్, భారతి తమ పిటిషన్‌లో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వృద్ధిలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. షర్మిలకు వాటాలు కేటాయించేందుకు తాము 2019 ఆగస్టు 21న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశామని పేర్కొన్నారు. అయితే, వాటా కేటాయింపు ఎప్పటికీ ఖరారు కాలేదని పిటీషన్ లో పేర్కొన్నారు.ఈ పిటిషన్ వైఎస్ కుటుంబంలో ఉన్న విబేధాలను బయట పెడుతోంది. షర్మిల మీద ప్రేమతో మొదట్లో షర్మిలకు వాటాలు కేటాయించాలని భావించానని, అయితే ఇటీవల ఆమె తనపై చేసిన విమర్శలు, రాజకీయ ప్రకటనల కారణంగా తాను ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ విభేదాలతో...
రాజకీయ విభేదాల కారణంగా కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ జగన్ నాలుగు మధ్యంతర దరఖాస్తులు కూడా దాఖలు చేశారు.NCLT ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8, 2024కి వాయిదా వేసింది. దీంతో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య వస్తున్న రాయబారం వార్తల్లో నిజం ఎంత అన్నదానిపై చర్చ జరుగుతుంది. న్యాయస్థానంలో తన చెల్లి, తల్లికి వ్యతిరేకంగా జగన్ కోర్టును ఆశ్రయించడంతో వీరి మధ్య ఇక సఖ్యత అనేది సాధ్యపడదన్నది ఈ పిటీషన్ తో సుస్పష్టమయిందని అంటున్నారు.


Tags:    

Similar News