వస్తాడు.. విషం కలిపిన ఆహారం పెడతాడు.. వెళ్ళిపోతాడు

ఓ కుక్కను స్థానికులు రక్షించగలిగారు

Update: 2024-10-05 15:29 GMT

తమిళనాడు పోలీసులు తిరువళ్లూరు జిల్లాలో 50 కుక్కలకు విషం పెట్టి చంపిన వ్యక్తిని పట్టుకున్నారు. వెట్రివేందన్ (43) తిరువళ్లూరు మునిసిపాలిటీలోని ASP నగర్, JR నగర్, సెంథిల్ నగర్, ఇతర పరిసర ప్రాంతాల్లోని 50 వీధి కుక్కలకు ఆహారంలో విషం కలిపి తినిపించి వాటి చావులకు కారణమయ్యాడు. వెట్రివేందన్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనిపై హత్య కేసు కూడా ఉందని, దర్యాప్తు పెండింగ్‌లో ఉందని పోలీసులు తెలిపారు.

12వ వార్డులో పిచ్చి కుక్కల ఫిర్యాదులేవీ లేకపోయినా కుక్కలు చనిపోతూ ఉండడం అక్కడి వారికి షాకింగ్ గా అనిపించింది. పారిశుధ్య కార్మికులు చనిపోయిన కుక్కల సంఖ్య కూడా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. సెప్టెంబరు ప్రారంభంలో ఒకే రోజు పారిశుధ్య కార్మికులు ఆరు కుక్కలు చనిపోయాయని కనుగొన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 22న వీధిలో చనిపోయిన 12 కుక్కలను గుర్తించారు. 50 దాకా చనిపోవడంతో మున్సిపాలిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

విషాహారం తిన్న ఓ కుక్కను స్థానికులు రక్షించగలిగారు. స్థానికులు, స్థానిక కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, తిరువళ్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) నిందితుడిని పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. సెప్టెంబరు 21 న CCTV ఫుటేజీలో, గుర్తు తెలియని వ్యక్తి కుక్కలకు విషపూరితమైన ఆహారాన్ని పెడుతున్నట్లు గుర్తించారు. అదే వ్యక్తి మరోసారి అక్టోబర్ 1 న, అక్టోబర్ 2 న కుక్కలకు విషాహారం పెట్టాడు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను పోలీసులు ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం వెట్రివేందన్‌ను గుర్తించారు. అయితే వెట్రివేందన్‌ ఈ పని ఎందుకు చేశాడా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.


Tags:    

Similar News