ఫ్రాడుగాళ్లు.. మీ ఫొన్లోనే ఉన్నారు జాగ్రత్త... ఆ నెంబరు వస్తే ఫోన్ లిఫ్ట్‌ చేయకపోవడమే బెటర్

ఫోన్ సీబీఐ పేరు మీద, పొలీస్ ఆఫీసర్ డీపీ తో వాట్సప్ కాల్ రావడంతో అమాయకులు మోసపోతున్నారు

Update: 2024-09-20 04:46 GMT

సీబీఐ అంటూ ఫోన్ కాల్ వస్తుంది. తాను సీబీఐ ఆఫీసర్ నని చెప్పి కుటుంబ సభ్యుల వివరాలు మరీ చెబుతాడు. మనల్ని భయంతో ముంచేస్తాడు. మన కుటుంబ వివరాలన్నీ ఫోన్లో చెప్పి.. మీ అమ్మాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని నమ్మే ప్రయత్నం చేస్తాడు. తనతో మీ అమ్మాయిని ఒకసారి మాట్లాడని చెబుతాడు. ఫోన్ చేసిన కేటుగాడు కేవలం హిందీ, ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివరాలను అడిగి ఈ కేసు నుంచి బయటపడాలంటే వెంటనే తమకు డబ్బులు పంపించాలని, కేసు లేకుండా మేనేజ్ చేస్తానని నమ్మిస్తాడు. కేవలం వాట్సప్ కాల్స్ ద్వారానే ఈ ఫ్రాడుగాళ్లు మీమ్మిల్ని సంప్రదిస్తారు.

సీబీఐ అంటూ...
ఫోన్ సీబీఐ పేరు మీద, పొలీస్ ఆఫీసర్ డీపీ తో వాట్సప్ కాల్ రావడంతో అమాయకులు మోసపోతున్నారు. వారు భయపడిపోతున్నారు. మన వివరాలను కరెక్ట్ గా చెబుతుంటే నిజమోమోనని భయపడిపోతారు. వాళ్లు అడిగినతంత సమర్పించుకుని అనేక మంది మోసపోతున్నారు. సీబీఐ, క్రైం బ్రాంచ్ డీసీపీ అంటూ పేర్లతో మరీ చెప్పి ఫోన్ చేసి మాయగాళ్లు మనల్ని వలలో వేసుకోవాలని చూస్తారు. ఎవరూ వారి మాయలో పడాల్సిన అవసరం లేదు. వారికి ధీటుగా సమాధానం చెప్పండి. అమ్మాయి అలాంటిది కాదని, కేసు ఫైల్ చేసుకోవాలని చెప్పండి. లేకుంటే మా ఇంటికొచ్చి అరెస్ట్ చేయమని మీరు ఎదురు జవాబివ్వండి. లేకుంటే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ధైర్యంగా చెప్పండి. అంతే తోకముడిచేస్తాడు.
కేసులో ఇరుక్కుంటారంటూ....
అంతే వెంటనే ఫ్రాడ్ గాడు కాల్ కట్ చేస్తాడు. లేకుంటే మిమ్మల్ని బెదిరించి మీదగ్గర ఉన్నంత వరకూ గుంజుకునే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి మోసగాళ్ల బారిన పడవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు పదే పదే ప్రకటనలు చేస్తున్నా అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్లను చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. దీనికి చెక్ పెట్టాలంటే ఒకటే మార్గం. మనం భయపడాల్సిన పనిలేదు. వాట్సాప్ కాల్ మనకు తెలియని వారి నుంచి వస్తే లిఫ్ట్‌ చేయకపోవడం మరింత మంచిది. ఎందుకంటే లిఫ్ట్‌ చేస్తే వాడి బెదిరింపులు మన మనసు కకావికలం అవుతుంది. అందుకే అపరిచితుల ఫోన్ నెంబరు నుంచి వాట్సప్ కాల్స్ వస్తే తస్మాత్ జాగ్రత్త. ఈ నెంబర్ల నుంచి 923453701457, 923115465232, 923424207703ల నుంచి ఫ్రాడు గాళ్లు చేసే అవకాశముంది.
రోజుకు మూడు కోట్లు....
అయితే పోలీసు రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. సైబర్ నేరగాళ్ల వలలో పడి కోట్లాది రూపాయలు అమాయకులు కోల్పోతున్నారు. మోసపోతున్న వారిలో అన్ని వర్గాల ప్రజలు ఉంటున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల లెక్కల ప్రకారం నేరగాళ్లు సైబర్ నేరాల ద్వారా రోజుకు మూడు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది మే నెల నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ తెలంగాణలో 1,100 కోట్లకు పైగానే మోసగాళ్లు కొల్లగొట్టారని చెబుతున్నారు. అపరిచిత ఫోన్ కాల్స్ ను, మెసేజ్ లకు రెస్పాండ్ కావద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వారి వలలో ఇంకా పడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో వారు రెచ్చిపోతున్నారు. ఉద్యోగాలు, ఎక్కువ వడ్డీతో పాటు ప్రజలను భయాందోళనలకు గురి చేసే వారి నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేదిశగా సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


Tags:    

Similar News