అక్క అనుమానస్పద మృతి.. ప‌రారీలో చెల్లెలు

తల్లిదండ్రులు శుభ కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఇద్ద‌రు కూతుళ్ల‌కు జాగ్రత్త చెప్పి ఇంటి నుంచి బ‌య‌లుదేరారు.

Update: 2023-08-30 13:47 GMT

తల్లిదండ్రులు శుభ కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఇద్ద‌రు కూతుళ్ల‌కు జాగ్రత్త చెప్పి ఇంటి నుంచి బ‌య‌లుదేరారు. అంతే తెల్లారి అనుకోని విషాదం. ఓ కూతురు విగత జీవిగా మారగా.. మరో కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంతకీ ఏం జరిగింది.

కోరుట్ల - భీమునిదుబ్బలో నివాసం ఉండే బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ముగ్గురు సంతానం కాగా పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తూ వర్క్ ఫ్రం హోం చేస్తుంది. చిన్న కూతురు చందన బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. కొడుకు హైద‌రాబాద్ లో చ‌దువుకుంటున్నాడు. అయితే.. తల్లిదండ్రులు ఓ ఫంక్షన్ నిమిత్తం సోమవారం హైదరాబాద్ వెళ్లారు. రాత్రి ఇద్ద‌రు కూతుళ్ల‌తో ఫోన్‌లో కూడా మాట్లాడారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఫోన్ చేయ‌గా ఎంత‌కు లిప్ట్ చేయ‌లేదు. దీంతో త‌ల్లిదండ్రులు ప‌క్కింటి వారికి కాల్ చేసి చూడ‌మ‌ని చెప్ప‌గా.. పెద్ద కూతురు దీప్తి సోఫాలో శవమై కనిపించింది. చిన్న కూతురు చందన అదృశ్య‌మైంది.

వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా.. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. ఇంట్లో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు ఉన్నాయి. వెంట‌నే పోలీసులు విచార‌ణ ప్రారంభించ‌గా.. ఉదయం 5 గంటల సమయంలో చిన్న కూతురు చందన.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిపోయినట్లు జగిత్యాల బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. దీంతో పోలీసులు.. ఇంట్లో మద్యం సేవించిన అనంతరం దీప్తిని చంపి ప‌రార‌య్యారా అనే కోణంలో ద‌ర్యాప్తు ప్రారంభించారు.


Tags:    

Similar News