మేకలను మేపడానికి వెళ్లి తిరిగి రాలేదు.. అడవిలోకి వెళ్లి చూస్తే!

మేకలను మేపడానికి వెళ్లిన వ్యక్తిని దారుణంగా

Update: 2024-09-15 14:48 GMT

మేకలు మేపేందుకు వెళ్లిన వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహం బగ్దరి జలపాతం పక్కనే ఉన్న దట్టమైన అడవిలో కనిపించింది. చేతులు, కాళ్లు తాళ్లతో కట్టివేసి చంపేశారు. ఆ వ్యక్తిని చంపేసి మేకలను తోలుకుని వెళ్లారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

మృతుడు జబల్‌పూర్‌లోని పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దువా గ్రామానికి చెందిన 55 ఏళ్ల రఘునాథ్ మార్విగా గుర్తించారు. శుక్రవారం బగ్దేరి అడవుల్లో మేకలను మేపేందుకు వెళ్లాడు. రాత్రి వరకు రఘునాథ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. అడవిలోకి వెళ్లి చూడగా చెట్టు దగ్గర రఘునాథ్ మృతదేహం లభ్యమైంది. మృతదేహం చేతులు, కాళ్లు తాళ్లతో కట్టబడి ఉంది. ఈ ఘటనతో గ్రామంతోపాటు పరిసర ప్రాంత గ్రామాల్లో భయం నెలకొంది.

విషయం తెలుసుకున్న పటాన్‌ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్యకు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఆ ప్రాంతమంతా సోదాలు చేసి ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. రఘునాథ్‌కు ఎవరితోనూ శత్రుత్వం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మేకల దొంగతనానికి పాల్పడిన వ్యక్తులే అతడిని చంపి ఉంటారని కుటుంబీకులు భావిస్తున్నారు.


Tags:    

Similar News