Victor James: విక్టర్ జేమ్స్ రాజా.. ఇతడి దారుణాలకు తమిళనాడు షాక్

ఉపయోగించగా తంజావూరులో లింక్స్ ఉన్నాయని బయటపడ్డాయి

Update: 2024-07-10 04:17 GMT

తమిళనాడులోని తంజావూరులో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడి, డబ్బు సంపాదించేందుకు వీడియోలు పోస్ట్ చేసినందుకు న్యాయస్థానం మంగళవారం పీహెచ్‌డీ స్కాలర్‌కి ఐదు జీవితకాల జైలు శిక్ష విధించింది. తమిళనాడుకు చెందిన పీహెచ్‌డీ స్కాలర్‌ విక్టర్ జేమ్స్ రాజా (35) ఈ దారుణాలకు పాల్పడ్డాడు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతనికి శిక్ష పడింది. పలు నేరాలకు సంబంధించి అతనికి రూ.6,54,000 జరిమానా కూడా విధించినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాజాపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై దాదాపు 14 నెలల తర్వాత తంజావూరులోని ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించింది. 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న ఎనిమిది మంది మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆ దారుణాన్ని రికార్డు చేసి ఇంటర్నెట్‌లో విక్రయించి డబ్బు సంపాదించినందుకు సీబీఐ అతడిని అరెస్టు చేసింది. ఇంటర్‌పోల్‌కు చెందిన ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ (ఐసిఎస్‌ఇ) డేటాబేస్ నుండి చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సిఎస్‌ఎఎమ్) చిత్రాలు, వీడియోలను సీబీఐ గుర్తించినప్పుడు మాత్రమే ఈ నేరం వెలుగులోకి వచ్చింది. నిందితులను కనిపెట్టడానికి దర్యాప్తు సంస్థ ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ప్రత్యేక సాధనాలను ఉపయోగించగా తంజావూరులో లింక్స్ ఉన్నాయని బయటపడ్డాయి. దీంతో విక్టర్ జేమ్స్ రాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో.. రాజా రెండేళ్లుగా ఎనిమిది మంది పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని దర్యాప్తు బృందం గుర్తించింది. ఇందులో అబ్బాయిలు మరియు బాలికలు ఉన్నారు. చాలా కేసుల్లో బాధితులు 12 ఏళ్ల లోపు వారేనని సీబీఐ గుర్తించింది.


Tags:    

Similar News