Trainee Army Officers: ట్రైనీ ఆర్మీ ఆఫీసర్లపై దాడి.. వెంట వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా జామ్ గేట్ సమీపంలో ఇద్దరు యువ సైనికాధికారులు

Update: 2024-09-12 03:46 GMT

TraineeArmyOfficers

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా జామ్ గేట్ సమీపంలో ఇద్దరు యువ సైనికాధికారులు, వారి మహిళా స్నేహితులపై సాయుధ దుండగులు దాడి చేశారు. తొలుత దోపిడీ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన దుండగులు అధికారులపై కిరాతకంగా దాడి చేశారు. ఆ తర్వాత ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, వారిలో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు తేలింది.

మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్న అధికారులు మధ్యాహ్నం ఛోటీ జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళలతో కలిసి బయటకు వెళ్లారు. ఇంతలో ఎనిమిది మంది వ్యక్తులు పిస్టల్స్, కత్తులు, కర్రలు చూపుతూ వారిని చుట్టుముట్టారు. ట్రైనీ ఆఫీసర్లు, మహిళల దగ్గర డబ్బు, వస్తువులను దోచుకున్నారు. దుండగులు ఒక అధికారిని, ఒక మహిళను బందీగా పట్టుకున్నారు. వీళ్ళను వదిలిపెట్టాలంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో వ్యక్తిని, మహిళను డబ్బులు తీసుకుని రావాలని పంపించారు.

ఒక బాధితుడు తన యూనిట్‌కు తిరిగి వెళ్లి తన కమాండింగ్ అధికారికి సమాచారం అందించాడు. ఆయన వెంటనే పోలీసులను అప్రమత్తం చేశాడు. పోలీసులు, సైనిక సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకోగా, దాడి చేసినవారు వాహనాలను చూసి పారిపోయారు. ఉదయం 6.30 గంటలకు నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం మోవ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అధికారులు గాయపడినట్లు వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు రుజువైనట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్‌ తెలిపారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని, ప్రమేయం ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News