వైవీకి ప్రమోషన్… ఆయన స్థానంలో?

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవిపై వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తి కావచ్చింది. ఈ [more]

Update: 2021-06-12 03:30 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవిపై వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తి కావచ్చింది. ఈ నెల 21వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియనుంది. మరోసారి వైవీ సుబ్బారెడ్డి పదవని జగన్ రెన్యువల్ చేస్తారా? లేదా కొత్త వారికి పదవి అప్పగిస్తారా? అన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీటీడీ ఛైర్మన్ గా అనేక పేర్లు విన్పిస్తుండటంతో వైవీకి ఎలాంటి పదవి అప్పగిస్తారన్న చర్చ కూడా పార్టీలో నడుస్తుంది.

పార్టీ పెట్టిన నాటి నుంచి….

వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు. జగన్ కు దగ్గర బంధువు కూడా. అధికారంలో లేనప్పుడు వైవీ సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునే వారు. అయితే 2019 ఎన్నికలలో ఒంగోలు ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయాలని గట్టిగా అనుకున్నారు. కానీ జగన్ అప్పడే పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో వైవీ సుబ్బారెడ్డి కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది.

పదవీ కాలం పూర్తికావస్తుండటంతో….

అయితే జగన్ వెంటనే వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పర్చారు. వైవీ సుబ్బారెడ్డి కూడా టీటీడీ ఛైర్మన్ పదవి దక్కిన వెంటనే గతంలో ఉన్న అసంతృప్తిని మరిచి తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే ఇప్పుడు పదవీకాలం పూర్తి కావస్తుండటంతో జగన్ మళ్లీ వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ గా రెన్యువల్ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ మనసులో మాత్రం వైవీ సుబ్బారెడ్డిని పెద్దల సభకు పంపాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది.

రాజ్యసభకు పంపాలని….

రాజ్యసభకు త్వరలో ఖాళీలు అవుతున్నాయి. అందులో ఒకటి వైవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలన్నది జగన్ నిర్ణయంగా తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చే అవకాశాలున్నాయంటు న్నారు. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం లేకపోవడంతో భూమనకు టీటీడీ ఛైర్మన్ ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. వైవీ సుబ్బారెడ్డి కూడా రాజ్యసభకు వెళ్లాలన్న ఉత్సాహంతో ఉన్నారు. మొత్తం మీద వైవీ సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్ రెెడ్డిని నియమించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News