ఫ్యాక్ట్ చెక్: నటి రోజా తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పు చేశారని విమర్శించలేదు

నటి, మాజీ మంత్రి రోజా విమర్శలు చేశారు

Update: 2024-09-24 10:25 GMT
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పెట్టే లడ్డూకు ఉపయోగించిన నెయ్యి విషయంలో వివాదం కొనసాగుతూ ఉంది. కోట్లాది మంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం జాతీయ స్థాయి అంశమైంది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు. ఇక తిరుమలలో మహా సంప్రోక్షణ చేపట్టారు.

ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా తిప్పి కొడుతున్నారు. ఈ ఆరోపణల వెనుక గల వాస్తవాలను వెలికి తీయాలని వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. సీబీఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాను తప్పు చేయలేదంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం చేశారు. తాము ఏ తప్పు చేయలేదని తిరుమల శ్రీవారి ఆలయం ముందు అఖిలాండం వద్ద కర్పూరం హారతి వెలిగించి ప్రమాణం చేశారు. పుష్కరిణిలో స్నానం చేసి మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, సీఎం చంద్రబాబు నాయుడు కావాలనే దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. "నేను గాని తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబం సర్వ నాశనం అయిపోవాలి. నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతాము" అంటూ భూమన ప్రమాణం చేశారు. తమపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలకు దమ్ముంటే శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేయాలని భూమన సవాల్ విసిరారు.

ఇక ఈ వివాదంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా స్పందించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

'అధికారం పోయేసరికి ప్లేట్ తిప్పేసిన రోజా.." అంటూ i_am_with_ncbn అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలో వైఎస్ జగన్ తప్పు చేశారని, పవిత్రమైన ఆలయాలను కూల్చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటూ రోజా వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది.




MANA TDP VIZIANAGARAM అనే ఎక్స్ ఖాతాలో కూడా వైఎస్ జగన్ ను రోజా విమర్శిస్తున్నట్లుగా పోస్టులు పెట్టారు.


యూట్యూబ్ లో కూడా ఇదే వాదనతో వీడియోలను షేర్ చేశారు.

Full View


ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేశారు. చంద్రబాబు గురించి చేసిన విమర్శలను వైఎస్ జగన్ పై చేసినట్లుగా ఎడిట్ చేశారు.

ఒరిజినల్ వీడియోలో మాజీ మంత్రి రోజా టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టడమే కాకుండా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.

వైరల్ వీడియోలో చాలా చోట్ల విజువల్స్ ను కట్ చేశారని స్పష్టంగా తెలుస్తూ ఉంది. రోజా మాట్లాడుతున్న సమయంలో మధ్యలో కట్ చేయడం, మరో విషయం గురించి ప్రస్తావించడం వంటివి మేము వైరల్ పోస్టులో గుర్తించాం.

వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా నిడివి ఎక్కువ ఉన్న ఒరిజినల్ వీడియోను పలు అధికారిక ఖాతాలు, మీడియా సంస్థలు పోస్టు చేశాయని మేము గుర్తించాం.
YSR Congress Party - YSRCP అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో రోజా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మేము గుర్తించాం.
"Nara Chandrababu Naidu 100 రోజుల పాల‌న హ‌త్య‌లు, అత్యాచారాలు, దాడులు, విధ్వాంసాలే. వాటి నుంచి డైవ‌ర్ట్ చేసేందుకు చంద్ర‌బాబు తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌లుపుతున్నార‌ని మాట్లాడారు. దేవుడిని సైతం త‌న స్వార్థ రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నాడు. ల‌డ్డూ త‌యారీలో ఎక్క‌డా క‌ల్తీ జ‌ర‌గ‌లేదు. ఇవ‌న్నీ జ‌గ‌న్ గారిపై కావాల‌ని చేసే ఆరోప‌ణ‌లే.
-మాజీ మంత్రి రోజా గారు" అంటూ వీడియోను పోస్టు చేశారు.
Full View

Rk Roja Selvamani అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా వైరల్ వీడియోకు సంబంధించి ఎక్కువ నిడివి ఉన్న వీడియోను మేము గుర్తించాం. అందులో రోజా టీడీపీపై విమర్శలు చేశారు.
Full View

Roja Selvamani అధికారిక ఫేస్ బుక్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేసిన ఒరిజినల్ వీడియోను మేము గుర్తించాం. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని రోజా సెల్వమణి విమర్శించారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు నెరవేర్చలేకపోయారని రోజా వీడియోలో విమర్శించారు.

Full View

రోజా సెల్వమణి అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా అసలు వీడియోను అప్లోడ్ చేశారని మేము గమనించాం.



ఈ వీడియోలలో ఎక్కడా కూడా రోజా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేయలేదు.
ఇక సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా రోజా చేసిన విమర్శలకు సంబంధించి పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
ఆ కథనాలను ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు.
రోజా ఒకవేళ వైఎస్ జగన్ ను విమర్శించి ఉంటే పలు మీడియా సంస్థలు కథనాలను ప్రముఖంగా ప్రచురించి ఉండేవి. కానీ ఏ మీడియా సంస్థ కూడా రోజా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినట్లుగా కథనాలను ప్రసారం చేయలేదు.
కాబట్టి, రోజా సెల్వమణి లడ్డూ వివాదానికి సంబంధించి వైఎస్ జగన్ ను విమర్శించారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఎడిట్ చేశారు.


Claim :  వైఎస్ జగన్ తప్పు చేశారని నటి, మాజీ మంత్రి రోజా విమర్శలు చేశారు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News