ఫ్యాక్ట్ చెక్: రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీని చంపిన షూటర్ ప్రెస్ మీట్ పెట్టలేదు.

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి బాబా సిద్ధిఖీని

Update: 2024-10-28 14:12 GMT
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య ఘటన బాలీవుడ్ ను షేక్ చేసింది. కాంగ్రెస్‌తో దశాబ్దాల అనుబంధాన్ని ముగించుకుని, ఈ ఏడాది ప్రారంభంలో అజిత్ పవార్ ఎన్‌సిపిలో చేరారు బాబా సిద్ధిఖీ. అక్టోబర్ 12న బాంద్రాలోని కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం వెలుపల ఉండగా అతడిని కాల్చి చంపారు. ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు చెందిన గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు ప్రకటించింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా జీషన్ సిద్ధిఖీ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు అక్టోబర్ 25న అరెస్టు చేశారు. సుజిత్ సుశీల్ సింగ్‌ను ముంబై పోలీసు బృందం లూథియానాలో పట్టుకుందని పీటీఐ కథనం తెలిపింది. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 24న ముంబై పోలీసులు హర్యానాకు చెందిన అమిత్ హిసాంసింగ్ కుమార్ అనే నిందితుడిని కూడా అరెస్టు చేశారు. రూపేష్ రాజేంద్ర మోహోల్ (22), కరణ్ రాహుల్ సాల్వే (19), శివమ్ అరవింద్ కోహద్‌లను పూణేలో అదుపులోకి తీసుకున్నారు.

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మద్దతుగా ఉన్నాడనే బాబా సిద్ధిఖీని హత్య చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. దీంతో సల్మాన్ ఖాన్ కు సెక్యూరిటీని కూడా భారీగా పెంచేశారు. సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ జరుగుతున్నా, ఎక్కడికైనా ప్రయాణిస్తున్నా ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

ఇంతలో బాబా సిద్ధిఖీని చంపిన యువకుడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.

"బిగ్ బ్రేకింగ్

బాబా సిద్ధిఖీ sh@oter ముంబై పోలీసు కస్టడీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన చర్యను సమర్థించుకున్నాడు

బాబా సిద్ధిఖీ మంచి వ్యక్తి కాదని, అతను చనిపోవడానికి అర్హుడని అన్నారు

దయచేసి పోలీస్ డిపార్ట్‌మెంట్ & అన్ని కోర్టులను మూసివేయండి, ఇకపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లా & ఆర్డర్‌ను చూసుకుంటుంది." అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.








మీడియాతో మాట్లాడిన ఆ వ్యక్తి బాబా సిద్ధిఖీ మంచివాడు కాదంటూ వ్యాఖ్యలు చేశాడు. 1993 ముంబై బాంబు పేలుళ్లకు కారణమైన దావూద్ ఇబ్రహీంతో బాబా సిద్ధిఖీకి సంబంధం ఉందని ఆరోపించాడు. బిష్ణోయ్ గ్యాంగ్‌లోని సభ్యుల సంఖ్య, వారిని ఎలా సంప్రదించవచ్చు, అతను ఈ గ్యాంగ్ లో ఎలా భాగమయ్యాడనే వివరాలను కూడా పంచుకున్నాడు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది బాబా సిద్ధిఖీని చంపిన వ్యక్తి కాదు. ఇతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తి.

వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు అక్టోబర్ 18 న News24 అధికారిక X పేజీలో ఓ క్లిప్‌ను చూశాము. ఆ వీడియో, వైరల్ అవుతున్న వీడియో ఒకటేనని నిర్ధారించాం.



మేము సంబంధిత కీ వర్డ్స్ సెర్చ్ చేయగా యోగేష్ అలియాస్ రాజు (26) అనే షూటర్‌ను యూపీలోని మధురలో అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్-హషీమ్ బాబా గ్యాంగ్‌లతో సంబంధం ఉన్న వ్యక్తి అని మీడియా నివేదికలను చూశాం. “ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో గత నెలలో జిమ్ యజమాని నాదిర్ షా హత్యకు సంబంధించి అతన్ని అరెస్టు చేశారు. అక్టోబరు 12న జరిగిన సిద్ధిఖీ హత్యతో అతనికి సంబంధం లేదు’’ అని మీడియా నివేదిక పేర్కొంది.


ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, మథుర పోలీసుల జాయింట్ టీమ్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాజు గాయపడ్డాడు. అతడిని ఆ తర్వాత అధికారులు అరెస్టు చేసినట్లు నివేదికలు తెలిపాయి. జిల్లా ఆసుపత్రికి తరలించిన తర్వాత రాజు విలేకరులతో మాట్లాడాడు.

"GK-1 gym owner murder: Second shooter arrested after shootout on Mathura highway" అంటూ indianexpress నివేదికను మేము కనుగొన్నాం. యోగేష్ బిష్ణోయ్ గ్యాంగ్ లో భాగమని పోలీసు అధికారులను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

దక్షిణ ఢిల్లీలోని GK-1లో 34 ఏళ్ల జిమ్ యజమానిని కాల్చిచంపిన తర్వాత పరారీలో ఉన్న రెండో షూటర్‌ను ఎన్‌కౌంటర్ తర్వాత అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారని నివేదిక తెలిపింది. షూటౌట్‌లో అతని ఎడమ కాలికి బుల్లెట్ గాయం అయింది.

నిందితుడు 26 ఏళ్ల యోగేష్ అకా రాజు లారెన్స్ బిష్ణోయ్, హషీమ్ బాబా గ్యాంగ్‌లకు చెందినవాడని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 17న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య యోగేష్ మథుర రిఫైనరీ ప్రాంతంలో ఉంటాడని సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. “ఉదయం 4.25 గంటలకు అపాచీ బైక్ ఆగ్రా-మథుర హైవే సర్వీస్ రోడ్డులోకి ప్రవేశించింది. డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని యోగేష్‌గా గుర్తించి లొంగిపోవాలని కోరారు. అయితే, అతను అనూహ్యంగా కాల్పులు జరిపాడు” అని డిసిపి (స్పెషల్ సెల్) మనోజ్ సి చెప్పారు.

యోగేష్ పోలీసులపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురు కాల్పుల్లో గాయపడ్డ అతడిని మథురలోని సివిల్ ఆసుపత్రికి తరలించి, అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు.

ఢిల్లీ పోలీసులు తన అధికారిక X పేజీలో GK జిమ్ హత్య కేసులో ప్రధాన షూటర్‌ను మధుర పోలీసుల సహాయంతో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.



పోలీసులు గతంలో యోగేష్ మీద పలు కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో బాలుడిని కత్తితో పొడిచి చంపిన కేసులో 2018లో తొలిసారి జైలుకెళ్లాడని అధికారులు తెలిపారు. 2022లో బెయిల్‌పై విడుదలైన తర్వాత ఢిల్లీ చేరుకున్నాడు.


అయితే బాబా సిద్ధిఖీ హత్య కేసును ముంబై పోలీసులు విచారించారు. ముంబయి పోలీసులు పలువురు షూటర్లను అరెస్టు చేశారు. పలువురు నిందితులు పరారీలో ఉన్నారు. అయితే ముంబై పోలీసులు యోగేష్‌ను అనుమానితుల్లో ఒకరిగా చెప్పలేదు.

ఇండియా టుడేలో "Baba Siddique had links with Dawood, claims arrested Bishnoi gang shooter" అంటూ అక్టోబరు 19న కథనాన్ని ప్రచురించారు.

ఈ నివేదికలో సిద్ధిఖీ హత్యతో అతనికి సంబంధాలు లేవని పేర్కొంది.

బాబా సిద్ధిఖీపై యోగేష్ వీడియో ప్రకటన వైరల్ కావడంతో, మధుర ఎస్ఎస్పీ శైలేష్ పాండే ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ANI నివేదించింది.

కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తికి బాబా సిద్ధిఖీ హత్యకు ఎలాంటి సంబంధం లేదు.


Claim :  బాబా సిద్ధిఖీని చంపిన షూటర్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు చెప్పాడు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News