ఫ్యాక్ట్ చెక్: కిటికీలో నుండి మహిళ మెడలో చైన్ ను తెంపుకుని వెళ్లిన ఘటన ఏపీలో చోటు చేసుకున్నది కాదు.

గుడిలో ఉన్న మహిళ మెడలో నుండి చెయిన్ ను దొంగలు

Update: 2024-10-19 05:12 GMT

thieves stole a chain from the neck of a woman


చైన్ స్నాచర్లు.. ముఖ్యంగా ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా వచ్చి మహిళల మెడల్లో లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి ఘటనల్లో మహిళలకు తీవ్ర గాయాలు అవుతుంటాయి. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోతుంటాయి. యువత కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ ఉంటారు.

తాజాగా ఓ చైన్ స్నాచింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వాట్సాప్ లో వైరల్ అవుతూ ఉంది. కొందరు మహిళలు గుడిలో పూజలు చేస్తూ ఉన్న సమయంలో కిటికీ పక్కన ఉన్న మహిళ మెడలో నుండి కొందరు చైన్ లాక్కుని వెళ్ళారు. వెంటనే ఆ మహిళ గట్టిగా అరవడంతో గుడిలో ఉన్న ఇతర మహిళలు ఏమైంది, ఏమైంది అంటూ టెన్షన్ పడడం మనం చూడొచ్చు.

"చిత్తూరు జిల్లా కుప్పంలో పూజల్లో ఉన్న మహిళ తాళిని తెంపుకుని వెళ్లిన చెయిన్ స్నాచర్లు. కూటమి ప్రభుత్వంలో దారి తప్పిన లా అండ్ ఆర్డర్. దొంగలు ఎప్పుడు మీద పడతారో అని భయపడుతున్న జనం. ఇదేనా ప్రజలు కోరుకున్న మార్పు. ఏపీలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్." అనే వాదనతో ఈ వీడియోను వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు.



ఫ్యాక్ట్ చెకింగ్:

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నది కాదు. తప్పుడు వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పలు ప్రముఖ మీడియా సంస్థలు ఈ ఘటనను నివేదించాయని గుర్తించాం.

ఆ మీడియా నివేదికలలో ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుందని స్పష్టంగా తెలిపారు.

"Thief snatches gold chain from Bengaluru woman's neck while praying in temple. Video" అంటూ హిందుస్థాన్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.


బెంగళూరు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుందని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. ఆలయంలో పూజా కార్యక్రమంలో మహిళ నిమగ్నమై ఉండగా, ఓ వ్యక్తి కిటికీలో నుండి ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దొంగ మహిళ చైన్ ను లాక్కుని వెళ్లినప్పుడు లాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇండియా టుడే అక్టోబర్ 15, 2024న ఈ ఘటనపై "Video: Thief pulls gold chain from woman's neck inside Bengaluru temple" అంటూ కథనాన్ని ప్రచురించింది.

ఈ సంఘటన అక్టోబర్ 10న జరిగిందని ఇండియా టుడే నివేదించింది. చైన్ స్నాచర్ సుమారు 30 గ్రాముల బంగారంతో పరారయ్యాడని పోలీసు వర్గాలు తెలిపాయి. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

శంకర్ నగర్‌లోని గణేష్ ఆలయంలో ఈ సంఘటన జరిగింది. ఆలయ కిటికీ దగ్గర ఓ మహిళ కూర్చుని ఉండగా, అకస్మాత్తుగా, కిటికీలోంచి ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగిలించాడని ఇండియా టుడే కథనంలో ఉంది. సెకన్ల వ్యవధిలో నిందితుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడని అధికారులు తెలిపారు.

కన్నడ ఛానల్ పబ్లిక్ టీవీ కూడా ఈ ఘటనను నివేదించింది. నందిని లే అవుట్ లోని శంకర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుందని అక్టోబర్ 14, 2024న కథనాన్ని ప్రచురించింది.

మహిళ మెడ లోని చైన్ ను లాగేయాలని దొంగ ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో మహిళ చైన్ ను పట్టుకోగలిగింది. సగం చైన్ ను దొంగ తీసుకుని వెళ్లగా.. మిగిలిన సగం అక్కడే ఉండిపోయింది. మొత్తం 70 గ్రాముల చైన్ కు సంబంధించి 30 గ్రాముల ముక్క దొంగ చేతికి చిక్కిందని పబ్లిక్ టీవీ నివేదించింది. అదే సమయంలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇదే ఘటనపై పలు తెలుగు మీడియా సంస్థలు కూడా నివేదికలను అందించాయి. ఆయా మీడియా నివేదికల్లో కూడా ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుందని తెలిపాయి. ఆ కథనాలను
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు.

చిత్తూరు జిల్లా కుప్పంలో వైరల్ వీడియో లోని ఘటన చోటు చేసుకోలేదని మీడియా నివేదికలు ధృవీకరిస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.

Claim :  ఏపీలోని కుప్పంలో గుడిలో పూజలో కూర్చున్న మహిళ మెడలో నుండి చెయిన్ ను దొంగలు లాక్కుని వెళ్లారు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News