Telangana : తెలంగాణలో విజృంభిస్తున్న జ్వరాలు.. ఆసుపత్రులన్నీ కిటకిట

తెలంగాణలో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు పడుతుండటం, వాతావరణ మార్పులతో విష జ్వరాలు చుట్టుముట్టాయి.

Update: 2024-07-05 03:34 GMT

తెలంగాణలో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు పడుతుండటం, వాతావరణ మార్పులతో విష జ్వరాలు చుట్టుముట్టాయి. దీంతో అనేక మంది ప్రజలు అనారోగ్యానికి పాలయి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరుతుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కసారిగా వైరల్ ఫీవర్లు విజృంభించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దోమలు వ్యాప్తి చెందడంతో జ్వరాలు కూడా ఎక్కువవతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఆసుపత్రుల్లో చేరి...
కలుషిత నీరు కారణంగా కూడా వైరల్ ఫీవర్ లు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఏడాది ఈ సీజన్ లో వైరల్ ఫీవర్ లు వస్తుండటం సర్వసాధారణమే అయినా ప్రజలు ఆరోగ్యంతో పాటు జేబులు కూడా గుల్ల చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని అనేక ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ల్యాబ్ ల వద్ద రక్త పరీక్షల కోసం అనేక మంది రోగులు వెయిట్ చేస్తుండటం కనిపిస్తుంది.
సాధారణ జ్వరం అయినా...
సాధారణ జ్వరం అయినా సరే భయపడి వైద్యుల వద్దకు ప్రజలు పరుగులు తీస్తుండటంతో గంటల తరబడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓపీల వద్ద ఎక్కువగా రోగుల క్యూ దర్శనమిస్తుంది. డెంగ్యూ వ్యాధి కూడా ప్రబలిందన్న ప్రచారంతో ప్రజలు భయపడి జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రి వద్దకు పరుగులు తీస్తున్నారు. దోమల బారిన పడకుండా, కలుషిత నీరు తాగకుండా తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. వైరల్ ఫీవర్ తో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


Tags:    

Similar News