Champai Soren: బంగ్లాదేశ్ చొరబాట్లపై జార్ఖండ్ ప్రభుత్వంపై మండిపడ్డ చంపై సోరెన్

ఆదివాసీలకు, స్థానికులకు ఆర్థికంగా, సామాజికంగా హాని చేస్తున్న ఈ అక్రమార్కులను

Update: 2024-08-29 14:53 GMT

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు చంపై సోరెన్ ఇటీవల రాష్ట్రంలో పెరుగుతున్న బంగ్లాదేశ్ చొరబాట్ల సమస్యపై స్పందించారు. బహిరంగంగా ఆందోళనలను వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో గిరిజనుల గుర్తింపు, భద్రతకు సంబంధించిన సమస్యలను విస్మరించారని ఆరోపించారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలను సోరెన్ తన లేఖలో తీవ్రంగా విమర్శించారు.

JMMలోని ప్రముఖ వ్యక్తి అయిన చంపై సోరెన్.. రాష్ట్రంలోని గిరిజన జనాభాపై నేరుగా ప్రభావం చూపే సమస్యలపై, ప్రత్యేకించి అక్రమ వలసల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసదారుల కారణంగా జార్ఖండ్ స్థానికుల్లో ఆందోళనలను పరిష్కరించడంలో ప్రస్తుత పరిపాలన విఫలమైందని సోరెన్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే ఈ సమస్యలను తీవ్రంగా పరిగణిస్తోందని చంపై సోరెన్ తన ప్రకటనలో తెలిపారు. ఈ పరిణామాల మధ్య ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జార్ఖండ్‌లోని స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తాను అడుగులు వేయక తప్పడం లేదని ఆయన చెప్పారు.

JMM పార్టీ అధినేత శిబు సోరెన్‌కు పంపిన రాజీనామా లేఖలో, చంపై సోరెన్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిబూ సోరెన్ మార్గదర్శకత్వంలో తాను, ఇతర పార్టీ కార్యకర్తలు పోరాడిన ఆదర్శాలకు ప్రస్తుతం JMM దూరమైందని పేర్కొన్నారు. ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వారి కోసం తన పోరాటం కొనసాగుతుందని త్వరలో బీజేపీలో చేరనున్న సోరెన్ అన్నారు. "ఈ రోజు నేను జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రాథమిక సభ్యత్వం, అన్ని పదవులకు రాజీనామా చేసాను. జార్ఖండ్‌లోని గిరిజనులు, దళితులు, వెనుకబడిన, సామాన్య ప్రజల సమస్యలపై నా పోరాటం కొనసాగుతుంది" అని సోరెన్ చెప్పారు. ఒకప్పుడు తనకు కుటుంబంలా ఉన్న పార్టీ ఇప్పుడు దారి తప్పిందని, దీంతో పార్టీని వీడాలనే బాధాకరమైన నిర్ణయం తీసుకున్నానని చంపై సోరెన్ వెల్లడించారు. శిబు సోరెన్‌ అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఆయనకు రాష్ట్రంలోని పరిస్థితి వినిపించేందుకు పార్టీలో వేదిక లేదని అన్నారు.

నేడు, బాబా తిల్కా మాంఝీ, సిడో-కన్హుల పవిత్ర భూమి సంతాల్ పరగణాలో బంగ్లాదేశ్ చొరబాటు పెద్ద సమస్యగా మారిందని ఆరోపించారు చంపై సోరెన్. నీరు, అడవి, భూమి కోసం పోరాటంలో విదేశీ బ్రిటిష్ వారి బానిసత్వాన్ని ఎన్నడూ అంగీకరించని వీరుల వారసుల భూములను ఈ చొరబాటుదారులు ఆక్రమించుకోవడం కంటే దురదృష్టం ఏముంటుందని అన్నారు. వీరి వల్ల ఫూల్-ఝానో లాంటి ధైర్యవంతులను ఆదర్శంగా భావించే మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెల పరువు ప్రమాదంలో పడిందని అన్నారు.

ఆదివాసీలకు, స్థానికులకు ఆర్థికంగా, సామాజికంగా హాని చేస్తున్న ఈ అక్రమార్కులను అరికట్టకపోతే సంతాల్ పరగణాలో మన సమాజం ఉనికికే ప్రమాదం పొంచి ఉందన్నారు. పాకూర్, రాజ్‌మహల్‌తో సహా అనేక ప్రాంతాల్లో, వారి సంఖ్య గిరిజనుల కంటే ఎక్కువగా ఉంది. రాజకీయాలకు అతీతంగా ఈ అంశాన్ని సామాజిక ఉద్యమంగా మార్చాలని, అప్పుడే ఆదివాసీల అస్తిత్వం కాపాడగలమన్నారు.

బీజేపీ మాత్రమే ఈ అంశంపై సీరియస్‌గా ఉందని, ఓట్ల కోసం ఇతర పార్టీలు దీనిని విస్మరిస్తున్నాయని అన్నారు. కాబట్టి, ఆదివాసీల గుర్తింపు, ఉనికిని కాపాడే ఈ పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు చంపై సోరెన్. జార్ఖండ్‌లోని గిరిజనులు, స్థానికులు, దళితులు, వెనుకబడిన తరగతులు, పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, యువత, సామాన్య ప్రజల సమస్యలు, హక్కుల కోసం ఈ కొత్త అధ్యాయంలో పోరాడుతానన్నారు.


Tags:    

Similar News