పట్టాలపై సిలిండర్ పెట్టారు.. చివరికి ఏమైందంటే?

ప్రయాగ్‌రాజ్ నుంచి హర్యానాలోని భివానీకి వెళ్తున్న కాళింది

Update: 2024-09-09 05:51 GMT
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారంనాడు రైల్వే ట్రాక్‌లపై ఎల్‌పిజి సిలిండర్‌ను ఉంచారు. ఓ ప్యాసింజర్ రైలు ఆ సిలిండర్ ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ అవ్వకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రయాగ్‌రాజ్ నుంచి హర్యానాలోని భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్ ప్రాంతం గుండా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. లోకోమోటివ్ పైలట్ ట్రాక్‌లపై ఎల్‌పిజి సిలిండర్, ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించి వెంటనే బ్రేక్‌లు వేశాడు. అయినప్పటికీ రైలు ఆగిపోయే ముందు సిలిండర్‌ను ఢీకొట్టింది. ఘటన తర్వాత కాన్పూర్ పోలీస్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎల్‌పిజి సిలిండర్‌తో పాటు పెట్రోల్ బాటిల్, పేలుడు పదార్థాలు, అగ్గిపెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో దాదాపు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. విచారణ కోసం మళ్లీ కాన్పూర్‌లోని బిల్హౌర్ స్టేషన్‌లో నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కాన్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. కేసును విచారించేందుకు కాన్పూర్ పోలీసులు ఐదు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు పాడైన సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ జరుపుతున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాన్పూర్ అదనపు పోలీసు కమిషనర్ హరీష్ చందర్ చెప్పారు.


Tags:    

Similar News