KCR : బాబు రీ ఎంట్రీతో భలే భలే...చూస్తుంటే బీఆర్ఎస్ కు మంచి రోజులొస్తున్నట్లే కనిపిస్తున్నాయ్‌గా

కేసీఆర్ కు కష్ట సమయంలో చంద్రబాబు అనుకోకుండా ఇచ్చిన తెలంగాణలో రీ ఎంట్రీ సానుకూలంగా మారనుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి

Update: 2024-07-08 06:14 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంచి రోజులు వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కేసీఆర్ కు కష్ట సమయంలో చంద్రబాబు అనుకోకుండా ఇచ్చిన తెలంగాణలో రీ ఎంట్రీ సానుకూలంగా మారనుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటి వరకూ కేసీఆర్ కు కొంత వ్యతిరేకత తెలంగాణలో కనిపిస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో అనుకోకుండానో, కావాలనో టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని భావించడం కొంత కలసి వచ్చే అంశంగానే చూస్తున్నారు. ఇప్పటి వరకూ కొంత వ్యతిరేకత ఉన్న తెలంగాణ ప్రజల్లో మళ్లీ ఏకం కావడానికి చంద్రబాబు ఎంట్రీ దోహదపడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఏపీ లీడర్లను...
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ నేతలను తమ లీడర్లుగా చూసేందుకు తెలంగాణ ప్రజలు ఇష్టపడరు. అది చంద్రబాబు అయినా.. జగన్ అయినా సరే.. వాళ్లు ఇక్కడ మళ్లీ పెత్తనం చేయడానికి వస్తున్నారనే అభిప్రాయమే కలుగుతుంది. ఆంధ్రావాళ్ల ఆధిపత్యాన్ని వదిలించుకున్నా ఇంకా వెంట పడుతుండటమేంటని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్దయెత్తున తెలంగాణ యువకులు కామెంట్స్ పెడుతున్నారు. మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా పెద్ద పెద్ద హోర్డింగ్ లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై అనేక మంది నేరుగానే అభ్యంతరం తెలిపారు. తెలంగాణ గడ్డ మీద మళ్లీ ఇదేందంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున కామెంట్స్ వచ్చి పడ్డాయి. దీంతో ఆ ఫ్లెక్సీలను, హోర్డింగ్ లను వెంటనే కొందరు తొలగించడం కూడా అంతే స్పీడ్ గా జరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు...
అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్ లో కలవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరితే ఇప్పటి వరకూ పెద్దగా పట్టించుకోని వారు మాత్రం చంద్రబాబును కలసిన తర్వాత మాత్రం కొంత వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరెకపూడి గాంధీతో పాటు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా చంద్రబాబును కలసిన వారిలో ఉన్నారు. మొన్నటి వరకూ దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబుకు దగ్గర కావడంతో ఒకింత బీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ అవుతుందన్న విశ్లేషణలు అయితే జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో కలసి బీఆర్ఎస్ ను తెలంగాణలో ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ పై సానుభూతి పెరిగే అవకాశాన్ని ఎంత మాత్రం కొట్టిపారేయలేం.
సెంటిమెంట్ ను ఎక్కువగా...
ఎందుకంటే.. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో కలసి టీడీపీ పోటీ చేసినందునే అప్పట్లో కూటమి అధికారంలోకి రాలేకపోయిందని ఇప్పటికీ గాంధీ భవన్ లో నేతలు చెబుతుంటారు. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కాలు.. వేలు చంద్రబాబు పెడితే అది కేసీఆర్ కు సానుకూలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కంటే.. రాష్ట్ర సెంటిమెంట్ నే ఎక్కువ మంది తీసుకుంటారు. అది జగన్ అయినా.. వైఎస్ షర్మిల అయినా.. చంద్రబాబు అయినా సరే... తెలంగాణలో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేద్దామంటే కుదరదని నేరుగానే చెబుతున్నారు. చంద్రబాబు ఎఫెక్ట్ బీజేపీ పైనకూడా పడే అవకాశముందని అంటున్నారు. అంతే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు కూడా నష్టం జరగుతుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు అలా వచ్చి ఇలా కేసీఆర్ నెత్తిన పాలు పోసి వెళ్లారన్నది మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు కొందరు సీనియర్ నేతలు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News