Telangana : మరో రెండు రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2024-09-27 03:49 GMT

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతున్నందున దాని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్సాలు నమోదవుతాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. వాతావరణ హెచ్చరిక ప్రకారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో పాటు గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సచివాలయం నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సీజన్ లో అత్యధిక వర్షాలు...
గత కొద్ది రోజులుగా వరసగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు భారీగా కురిశాయి. ఎన్నడూ లేనంతగా ఈ సీజన్ లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అసలు ఎండను చూసి చాలా రోజులయిందని జనం అనే పరిస్థితికి వచ్చింది. వర్షం అంటేనే విసుగు వచ్చింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో దోమల బెడద ఎక్కువ కావడంతో అనేక రకాల వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వాటితో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో విషజ్వరాలు ప్రబలాయని వైద్య ఆరోగ్య శాఖ కూడా తెలిపింది. వరసగా అల్పపీడనాలు ఏర్పడటం, దాని ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వర్షం అంటేనే భయపడిపోయే పరిస్థితికి వచ్చారంటే అతిశయోక్తి కాదు. చలి వాతావరణానికి తోడు వర్షంకురుస్తుండటంతో అనేక రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. మరో ద్రోణితో రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.


Tags:    

Similar News