ఇది ధర్మ పరిరక్షణపై జరిగిన దాడి: పవన్ కళ్యాణ్
ఒక మూక రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో;

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని తెలిపారు. ఇదొక దురదృష్టకరమైన ఘటన అని, ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలన్నారు.
రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని పవన్ కళ్యాణ్ కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారని, ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.