Mopidevi : ఉన్న పదవి పాయె.. లేని పదవి కోసం ఎదురు చూపులు ఎన్నాళ్లు?
వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ తన పదవికి రాజీనామా చేశారు;

వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభకు రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలని భావించారు. కానీ కొన్నాళ్ల నుంచి ఆయన పదవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవలే ఐదు ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అయినా అందులో మోపిదేవి పేరు కనిపించలేదు. మూడు టీడీపీ, జనసేన, బీజేపీ చెరొక స్థానం తీసుకున్నా మోపిదేవి వెంకటరమణకు మాత్రం ఛాన్స్ రాలేదు. అయితే ఐదుగురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను శాసనమండలి ఛైర్మన్ కు అప్పగించారు. అవి ఆమోదం పొందితే ఐదు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతాయి. అందులో ఒకటి మోపిదేవి వెంకటరమణకు వస్తుందని అనుకుంటున్నా టీడీపీలో మాత్రం పెద్దయెత్తున పోటీ ఉండటం ఆయన అనుచరుల్లో ఆందోళన కలిగిస్తుంది.
సుదీర్ఘకాలం టీడీపీకి వ్యతిరేకంగానే...
మోపిదేవి వెంకటరమణకు గత ఎన్నికలలో పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినా ఆయన గెలుపు సాధించకపోతే ఎమ్మెల్సీని చేసి జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మోపిదేవి వెంకటరమణ సుదీర్ఘకాలం జగన్ వెంటే నడిచారు. వైసీపీలో నమ్మకమైన నేతగా కొనసాగారు. అయితే 2019 లో అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిని రద్దు చేస్తూ ప్రతిపాదన చేయడంతో మోపిదేవి వెంకటరమణతో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ లను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించి జగన్ వారిద్దరికీ రాజ్యసభ పదవిని ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఆయనకు రేపల్లె టిక్కెట్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్నారు.
రేపల్లెలో నో ఛాన్స్...
మోపిదేవి వెంకట రమణ గతంలో మంత్రిగా చేసినప్పటి నుంచి క్లాస్ నాయకుడిగా మారి క్షేత్రస్థాయిలో ప్రజలను పట్టించుకోలేదనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. టీడీపీలో చేరినా ఆయనకు రేపల్లె నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడం అంత సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ బలమైన అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అనగాని రెవెన్యూ శాఖ మంత్రిగా కీలకంగా ఉన్నారు. అనగానిని కాదని మోపిదేవిని నమ్మి పార్టీని కానీ, టిక్కెట్ ను కానీ, ఎటువంటి బాధ్యతలను కానీ అప్పగించే పరిస్థితి మాత్రం టీడీపీలో లేదు. కాకుంటే రాజ్యసభ పదవి స్థానానికి రాజీనామా చేసినందుకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇవ్వవచ్చన్నది పార్టీ నుంచి వినిపిస్తున్న టాక్.
పార్టీ మారి ఏం సాధించారంటూ...
మరి మోపిదేవి వెంకటరమణ పార్టీ మారి ఏం సాధించినట్లని ఆయన అనుచరులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. జగన్ అన్ని పదవులు ఇచ్చినా వదిలి వెళ్లిన మోపిదేవికి టీడీపీలో అంతటి ప్రాధాన్యత దక్కదని తెలిసినా రాంగ్ స్టెప్ వేశారని సొంత సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు. మోపిదేవి తన పదవిని త్యాగం చేసినందుకు టీడీపీ నాయకత్వం తమ నేతకు పదవి ఇవ్వాలని కోరుతున్నారు. త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో మోపిదేవి పేరును పరిశీలించి ఖరారు చేయాలని ఇప్పటికే ఆయన అనుచరులు కొందరు పార్టీ పెద్దలను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మొత్తం మీద మోపిదేవి ఉన్న పదవికి రాజీనామా చేసి లేని పదవి కోసం ఎదురు చూడటం తప్ప ఆయన చేయగలిగిందేమీ లేదు.