స్కూల్ నుంచి సస్పెండ్.. మనస్తాపంలో విద్యార్థి ఆత్మహత్య

విజయనగరం జిల్లా భోగాపురంలోని మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న చుక్క యోగేందర్ రెడ్డి అనే విద్యార్థి స్కూల్ సమీపంలో..

Update: 2022-03-12 12:20 GMT

భోగాపురం : 9వ తరగతి విద్యార్థి.. తనను స్కూల్ నుంచి సస్పెండ్ చేశారన్న మనస్తాపంతో స్కూల్ కి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురంలో శుక్రవారం రాత్రి జరిగింది. భోగాపురంలో ఉన్న మోడల్ స్కూల్ లో చుక్క యోగేందర్ 9వ తరగతి చదువుతున్నాడు.

విజయనగరం జిల్లా భోగాపురంలోని మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న చుక్క యోగేందర్ రెడ్డి అనే విద్యార్థి స్కూల్ సమీపంలో శుక్రవారం రాత్రి మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యోగి తో పాటు కొంతమంది విద్యార్థులు ఇటీవల తరగతి గదిలో సెల్‌ఫోన్‌తో సెల్ఫీ‌లు తీసుకొని స్టేటస్‌లో పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ సంధ్యారాణి శుక్రవారం మధ్యాహ్నం యోగితో పాటు కొంతమంది విద్యార్థులను మందలించింది. వారి తల్లిదండ్రులను స్కూల్ కి పిలిపించి మాట్లాడారు.
ఈ క్రమంలో యోగేందర్ తండ్రి రాము కూడా పాఠశాలకు రాగా.. మీ అబ్బాయి వల్ల స్కూల్ పరువు పోతోందని, ఇలా చేస్తే టీ.సీ ఇచ్చి పంపించేస్తామని హెచ్చరించింది. మొదటి తప్పుగా భావించి వదిలేయాలని విద్యార్థి తండ్రి రాము ప్రిన్సిపాల్‌ను కోరారు. ప్రిన్సిపల్ వినకుండా.. మీ అబ్బాయిని ఇంటికి తీసుకుని వెళ్లిపోవాలని చెప్పింది. ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి కుమారుడ్ని గట్టిగా మందలించి ఇంటికి తీసుకెళ్తుండగా పాఠశాల వద్దనే తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుంచి యోగి కోసం కుటుంబ సభ్యులు అంతా వెతుకుతున్నారు. శనివారం ఉదయం పాఠశాల సమీపంలోనే మామిడి చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. దీనిపై విద్యార్థి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News