ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్‌లో దుర్గా మాత విగ్రహం ధ్వంసం చేసింది మత విద్వేషాల వల్ల కాదు.

హైదరాబాద్ లో దుర్గామాత విగ్రహం ధ్వంసం చేసినా కూడా హిందువులు

Update: 2024-10-14 06:54 GMT
దేశవ్యాప్తంగా విజయదశమిని ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా పలు ప్రాంతాల్లో దుర్గాదేవి మండపాలను ఏర్పాటు చేశారు. విగ్రహాల నిమర్జనం కార్యక్రమం చేపట్టారు. వివిధ ఘాట్‌లు, నీటి వనరులలో దుర్గా విగ్రహాలను నిమజ్జనం చేయడంతో చాలా ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో అక్టోబర్ 12న 400 దుర్గా విగ్రహాలు నిమజ్జనం కాగా, అక్టోబర్ 13న 1,000 కి పైగా నిమజ్జనం జరిగాయి. నగరంలోని ఐటీ హబ్ సైబరాబాద్ కమిషనరేట్‌లో అక్టోబర్ 12న 689, ఆదివారం 110 విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. సోమవారం నాడు మరో 135 విగ్రహాల నిమజ్జనం జరగనున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో సుమారు 1000 విగ్రహాల నిమజ్జనం జరిగాయి. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజా, గార్డెన్‌ పాయింట్‌, జలవిహార్‌, సంజీవయ్య పార్క్‌తో సహా నగరంలోని బేబీ పాండ్స్‌లో విగ్రహాలను నిమజ్జనం చేశారు.

ఈ నేప‌థ్యంలో దుర్గా పూజ ప‌ండ‌ల్ విధ్వంసానికి సంబంధించిన వీడియో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ ఫుటేజీలో అక్కడ పలువురు వ్యక్తులతో పాటు పలువురు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో చూడవచ్చు.

సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు. ఈ సంఘటనపై వివిధ ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

ఒక వినియోగదారు వీడియోను షేర్ చేస్తూ.. 'ఇది భాగ్యనగర్, పాకిస్థాన్ కాదు. దేవి మాతకు అంకితం చేసిన నవరాత్రి పండుగ మధ్యలో ఉన్నాము. ఈ సమయంలో ఇలాంటి చర్య అవమానకరం.' అని పోస్టులు పెట్టారు.


 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. దుర్గా మండపంలో విగ్రహం ధ్వంసం ఘటన వెనుక ఎలాంటి మతపరమైన కోణం కూడా లేదు.

హైదరాబాద్‌లోని దుర్గాపూజ మండపాన్ని ధ్వంసం చేయడంలో మతపరమైన కోణం లేదు. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు మేము siasat.com ప్రచురించిన కథనాన్ని కనుగొన్నాము.

సియాసత్ కథనంలో, నగరంలోని నుమాయిష్ గ్రౌండ్స్‌లో గురువారం రాత్రి, అక్టోబర్ 10న రాత్రి సమయంలో దుర్గా దేవి విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు బేగంబజార్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు కృష్ణయ్యగౌడ్‌ అని తెలిపారు. అతడు మానసిక వికలాంగుడు, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.

కీవర్డ్‌ సెర్చ్ చేయగా దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు ఒకరిని అరెస్టు చేశారు పోలీసులు. అంతేకాకుండా ఈవెంట్ నిర్వాహకులను కూడా అదుపు లోకి తీసుకున్నారు అనే శీర్షికతో ANI ప్రచురించిన కథనాన్ని మేము చూశాము.

ANI కథనంలో, “ఉదయం 6:00 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉంచిన దుర్గామాత విగ్రహం, కుడి చేయి ధ్వంసం అయిందని, పాదాల దగ్గర ఉంచిన ప్రసాదం, ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారని మాకు ఫోన్ వచ్చింది. ఆకలితో ఉన్న వ్యక్తి ఈ మండపం వద్దకు వచ్చి ఆహారం కోసం వెతుకుతున్న సమయంలో ప్రసాదాన్ని చెల్లాచెదురు చేశాడని, ఆ గొడవలో విగ్రహం ధ్వంసం అయిందని డీసీపీ అక్షాష్ యాదవ్ తెలిపారు. ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు." అని ఉంది.

"నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగింది. ఎవరైనా బహిరంగ ప్రదేశంలో ఏదైనా విగ్రహాన్ని ఉంచిన తర్వాత వారు ఆన్‌లైన్ ఇన్టిమేషన్ ఫారమ్‌ను నింపాలి. ఆ ఫారమ్‌లో అక్కడే ఉండే వాలంటీర్ల పేరును ఇవ్వాలి. నిర్వాహకులు ఐదుగురు వాలంటీర్ల పేర్లను అందించారు. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మేము నిర్వాహకులపై కేసు నమోదు చేసాము, ”అని డీసీపీ చెప్పారు.

'తెలంగాణ టుడే' ప్రచురించిన కథనంలో సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ విలేకరుల సమావేశంలో ఎలాంటి మతపరమైన కోణం లేదని వివరణ ఇచ్చారు. అర్థరాత్రి కృష్ణయ్యగౌడ్ మానసిక పరిస్థితి నిలకడగా లేదని, ఆకలితో ఉండడంతో ఆహారం వెతుక్కుంటూ వేదిక వద్దకు వచ్చారని పేర్కొన్నారు.

అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన ఓ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో ఈ ఘటనకు సంబంధించి ఓ బిచ్చగాడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అందువల్ల, వైరల్ అవుతున్న వాదన తప్పుదోవ పట్టించేదిగా మేము గుర్తించాము. నుమాయిష్ గ్రౌండ్‌లోని దుర్గా పూజ మండపాన్ని ధ్వంసం చేయడంలో మతపరమైన కోణం లేదు.
Claim :  హైదరాబాద్ లో దుర్గామాత విగ్రహం ధ్వంసం చేసినా కూడా హిందువులు మౌనంగా ఉన్నారు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News