శభాష్ ఆంధ్ర.. తెలంగాణ డీలా

అంతరించిపోతున్న పెద్ద పులల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జులై 29న గ్లోబల్ టైగర్ డేని జరుపుకుంటున్నారు

Update: 2023-07-29 11:37 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దపులుల సంఖ్య భారీగా పెరిగింది. 2018లో చేపట్టిన గణనలో 48 మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అవి 63కి చేరాయని status of Tigers Co-predators & Prey in India, 2022 రిపోర్టుల ద్వారా తెలిసింది. ఈ లెక్కల ప్రకారంలో ఏపీలో నాలుగేళ్ళ కాలంలో  పులుల అభివృద్ది గణనీయంగా జరిగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

NTCA 'స్టేటస్ ఆఫ్ టైగర్ కో-ప్రెడేటర్స్ అండ్ ప్రే ఇన్ ఇండియా 2022'ని శనివారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏపీలో పులుల సంఖ్య 2018లో 48 ఉండగా.. 2022లో 63కి పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో 2018లో 26 నుండి 2022లో 21కి తగ్గింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) లో పెద్ద పులుల సంఖ్య బాగా పెరిగింది. అందులో 15 పెద్ద పులులు కొత్తగా వచ్చి చేరాయి. అయితే తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య పెరగగా.. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో పులుల సంఖ్య తగ్గింది. NTCA నివేదికలో, "జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణా రాష్ట్రాల్లో పులుల సంఖ్య బాగా తగ్గింది. ఈ రాష్ట్రాలలో పులుల సంరక్షణపై పటిష్ట చర్యలు తీసుకుని.. రక్షిత ప్రాంతాలలో వేటను అరికట్టడం, పులుల నివాసానికి చర్యలు చేపట్టడం.. వంటి కార్యకలాపాలు చేస్తే ఇప్పటికీ పులుల జనాభాను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి. పులులు కవాల్ టైగర్ రిజర్వ్, తెలంగాణలోని చెన్నూరు, ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ లో ఇప్పుడు లేవు." అని ఉంది.

నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మేనేజ్‌మెంట్ ఎఫెక్టివ్‌నెస్ ఎవాల్యుయేషన్‌లో 82.5 స్కోర్‌ను సాధించింది. ఇది గత నాలుగేళ్లలో గుడ్ నుండి వెరీ గుడ్‌కి చేరుకుంది. ఇది దేశంలో బాగా సంరక్షణ చర్యలు తీసుకున్న 24వ టైగర్ రిజర్వ్. ఆర్మాబాద్ టైగర్ రిజర్వ్ MEEలో 78.7 స్కోర్ సాధించింది, ఇది గుడ్ నుండి నుండి వెరీ గుడ్ కేటగిరీకి మారింది. ఇది దేశంలో బాగా సంరక్షణ చర్యలు తీసుకున్న 28వ టైగర్ రిజర్వ్. కవాల్ టైగర్ రిజర్వ్ MEEలో 74.2 స్కోర్ చేసింది, కవాల్ 34వ స్థానంలో ఉంది. 2012లో కవల్ తెలంగాణ 2,015 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, తెలంగాణలోని అమ్రాబాద్‌ను 2015లో 2,611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ గతంలో కొన్ని సమస్యల కారణంగా 'రెడ్ కారిడార్'గా పరిగణించారు. ఇప్పుడు NTCA ప్రకారం మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ రిజర్వ్ 3296 చ.కి.మీ.లో విస్తరించి ఉంది

అంతరించిపోతున్న పెద్ద పులల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జులై 29న గ్లోబల్ టైగర్ డేని జరుపుకుంటున్నారు. 13 టైగర్ శ్రేణి దేశాలు కలిసి 2010లో ఈ దినోత్సవాన్ని మొదలుపెట్టారు. ప్రతీ ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో దాదాపు 5,000 పులులు మాత్రమే ఉన్నాయి. అందులో 3,000కు పైగా భారత్ లోనే ఉన్నాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి భారత్ పులుల సంఖ్యను లెక్కపెడుతుంది. 2006 నుంచి దేశంలో పులుల సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది. 2006లో 1,411గా ఉన్న పులుల సంఖ్య, 2010లో 1,706.. 2014లో 2,226, 2019లో 2,967, 2022లో ఏకంగా 3,167 పులులు దేశంలో ఉన్నాయని తేలింది. భారతదేశంలో పులుల సంఖ్య 3,000 మార్కుకు చేరిందని ప్రధాని మోదీ 2019లోనే ప్రకటించారు.


Tags:    

Similar News