India Vs New Zealand : ఈ టెస్ట్‌ అయినా గెలిచి పరువు నిలుపుకుంటారా? ఫ్యాన్స్ కోరిక తీర్చండి బాసూ

భారత్ - న్యూజిలాండ్ చివరి టెస్ట్ మ్యాచ్ నవంబరు 1వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ లోనైనా భారత్ గెలిచి పరువు నిలుపుకోవాలి

Update: 2024-10-28 04:14 GMT

India Vs New Zealand 2024

భారత్ - న్యూజిలాండ్ చివరి టెస్ట్ మ్యాచ్ నవంబరు 1వ తేదీన జరగనుంది. ఇప్పటికే రెండు టెస్ట్‌ల్లో ఓటమిపాలయిన భారత్ మూడో టెస్ట్ కు సిద్ధమవుతుంది. కనీసం ఈ టెస్ట్‌లోనైనా గెలిచి ఫ్యాన్స్ కు మంచి గుడ్ న్యూస్ అందించాలని భావిస్తున్నారు. అసలు బెంగళూరు, పూణే టెస్ట్‌ మ్యాచ్ లలో భారత్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడానికి అనేక కారణాలున్నాయి. వాటిపై పోస్టుమార్టం చేయాల్సి ఉంది. లేకుంటే టెస్ట్ ర్యాకింగ్స్ లో ఇండియా మరింత వెనకబడే అవకాశముంది. ఇప్పటికే ప్రమాదకరమైన పరిస్థితుల్లో టీం ఇండియా ర్యాకింగ్ ఉండటం ఆందోళనకు దారి తీస్తుంది. అందుకు గల కారణాలపై బీసీసీఐ అన్వేషించాల్సి ఉంటుంది.

ఆటగాళ్లపై వత్తిడి...
ఆటగాళ్లపై వత్తిడి అధికంగా ఉండటమే భారత్ ఓటమికి ప్రధాన కారణమని అంటున్నారు. వరసగా టీ 20లు ఆడుతూ, ఐపీఎల్ లో ఆడుతూ బిజీగా గడుపుతూ ఆ ఆటకు అలవాటు పడిపోయిన మనోళ్లు.. టెస్ట్ క్రికెట్ కు వచ్చేసరికి చేతులెత్తేశారు. టీ 20 మ్యాచ్ లు, వన్డేలు వరసగా ఆడుతూ దానికి బాగా భారత్ బ్యాటర్లు, బౌలర్లు సింక్ అయిపోయారు. టెస్ట్ క్రికెట్ అన్నది ఒక్కటి ఉన్నదన్న సంగతి మర్చి పోయారు. టెస్ట్ మ్యాచ్ లో నిదానంగా ఆడుతూ పరుగులు సాధించాల్సి ఉంటుంది. కానీ టీ 20లలో అలా కాదు. ధనాధన్ కొట్టేసి.. పరుగులు సాధించడం. అదే ఊపుతో వచ్చిన మనోళ్లు అవుటయి తక్కువ పరుగులకే తొలి టెస్ట్ మ్యాచ్ లో అవుటయ్యారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
బీసీసీ తప్పిదం కూడా...
బీసీసీఐ తప్పిదం కూడా ఇందులో ఉందని అనేక మంది క్రీడాభిమానులు చెబుతున్నారు. వరసగా విరామం లేకుండా టీ20లను నిర్వహిస్తుండటంతో ఆటగాళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. మరోవైపు ఏ మాత్రం కొద్దిగా వెసులు బాటు కుదిరినా వారు ప్రాక్టీస్ కంటే ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ వారిపై ఉన్న వత్తిడిని తగ్గించాలని క్రికెట్ ప్యాన్స్ కోరుతున్నారు. మూడో టెస్ట్ మ్యాచ్ లోనైనా కనీసం గెలిచి పరువు దక్కించుకుంటే అదే పదివేలు అన్నట్లుగా తయారయింది భారత్ పరిస్థితి. భారత్ క్రికెట్ లో ఇంతటి దయనీయమైన పరిస్థితి తలెత్తడానికి గల కారణాలను బీసీసీఐ పోస్టు మార్టం నిర్వహించాల్సి ఉంటుంది. లేకుంటే దేశమేదైనా, మైదానమేదైనా, భారత్ కు ఓటమి తప్పదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News