మూడు రోజుల పాటూ సీఎం జగన్ అక్కడే

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి 3 రోజులపాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జూలై 8న ఆయన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ

Update: 2023-07-08 02:27 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి 3 రోజులపాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జూలై 8న ఆయన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్సార్ జిల్లాకు వెళ్తున్నారు. శనివారం మధ్యాహ్నం 2.05 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్సార్‌ ఘాట్‌కు సీఎం జగన్ చేరుకుని వైఎస్సార్ ఘాట్‌ వద్ద ఆయనకు నివాళులు అర్పించనున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక ఇడుపులపాయలో తన నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.

రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకుంటారు. గండిపేట వద్ద ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం జగన్ పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ ఆఫీసు భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్‌ ఫ్రెంట్‌ చేరుకుని కెనాల్‌ డెవలప్‌మెంట్‌ ఫేజ్‌ –1 పనులను ప్రారంభించనున్నారు. పులివెందులలోని నూతనంగా నిర్మించిన వైఎస్సార్‌ ఐఎస్‌టిఏ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు. జులై 10న ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి జగన్ కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్‌ మార్గ్, రాజీవ్‌ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తికి జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్‌ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.


Tags:    

Similar News