Revanth Reddy : రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటుకు అసలు కారణమదేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ మీదున్నారు. డెసిషన్స్ ఫాస్ట్ గా తీసుకుంటూ ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు

Update: 2024-08-28 11:29 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ మీదున్నారు. డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటూ ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే ముందు ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతల వ్యవహారశైలిని చూసీ చూడనట్లు వదిలేశారు దీంతో బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారు. పదేళ్లలో అందిన కాడికి దండుకున్నారు. వ్యాపారాలతో పాటు కంటి ముందే ఆర్థికంగా బలపడ్డారు. ఇన్నోవా కార్లతో పాటు ఫాంహౌస్ లు నిర్మించుకుని ఎంజాయ్ చేశారు.

తక్కువ సమయంలోనే...
నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల అండ చూసుకుని వారి ప్రధాన అనుచరులు తక్కువ సమయంలోనే కోట్లకు పడగలెత్తారు. అతి విలువైన స్థలాలను సొంతం చేసుకున్నారు. లిక్కర్ వ్యాపారంలో వాళ్లే. ఇసుక దందా చేసేది వాళ్లే. ఏచిన్న కాంట్రాక్టు అయినా తమ చేయి దాటి పోనివ్వరు. అలా తొమ్మిదేళ్ల పాటు ఆడింది ఆటగా..పాడింది పాటగా వ్యవహరించారు. ఇక పరిశ్రమల నుంచి వసూళ్లు మామూలుగా చేయలేదన్న ఆరోపణలున్నాయి. ఏ చిన్న కార్యక్రమం జరిగినా విరాళాలు సేకరించి అందులో కొంత ఖర్చు చేసి మిగిలింది జేబులో వేసుకున్నారన్న విమర్శలు జోరుగా వినిపించాయి. బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక కారణం.
అందుకే హైడ్రా...
అయితే ఇప్పుడు నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి హైడ్రాను ముందుకు తెచ్చారంటున్నారు. ఒకవైపు ప్రజల్లో మంచి పేరు రావడంతో పాటు మరొక వైపు వారు ఆర్థికంగా నష్టపోతారు. వచ్చే ఎన్నికల నాటికి నేతలు ఖర్చు చేయడానికి కూడా భయపడేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే హైడ్రా ను ఏర్పాటు చేసింది సదుద్దేశ్యంతోనే. చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూలగొట్టి హైదరాబాద్ కు భవిష్యత్ లో తాగు నీటి ఇబ్బందులు, భూగర్భ జలాల సమస్య తీరడంతో పాటు ముంపు సమస్య నుంచి కూడా జంట నగరాలు బయటపడే అవకాశాలున్నాయి. ఇది మరో కోణం.
బీఆర్ఎస్ నేతలే....
ఇక బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా హైడ్రా పనిచేస్తుందన్న ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ కు ఆర్థికంగా సహకరిస్తున్న వారి మూలాలను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే రేవంత్ దీనిని తీసుకువచ్చారంటున్నారు. నిజంగానే బీఆర్ఎస్ నేతలు భయపడి పోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిబంధనలను అతిక్రమించి గత పదేళ్లుగా ప్రభుత్వ స్థలాలను, నాలాలను, చెరువులను, కుంటలను ఆక్రమించారు. ఇక కొందరు బిల్డర్లు కూడా బీఆర్ఎస్ కు ఆర్థికంగా అండగా నిలిచారు. వారిని దెబ్బతీయడం ఒక లక్ష్యమైతే.. మరొకటి ప్రజల్లో మంచి పేరు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను రేవంత్ రెడ్డి చేతల్లో నిరూపిస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News